కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కకు ఘోర అవమానం .. అవతరణ వేడుకల్లో కుర్చీ కూడా వెయ్యని అధికారులు
ములుగు నియోజకవర్గంనుండి ప్రజలచేత ఎన్నికోబడిన మహిళా గిరిజన నేతకు అవమానం జరిగింది. ములుగు కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు సీతక్కకు తెలంగాణా అవతరణ దినోత్సవం సాక్షిగా చేదు అనుభవం ఎదురైంది. తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం లేదనే విషయం తాజాగా జరిగిన సంఘటనతో తేటతెల్లం అయ్యింది.
కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేకు తెలంగాణా అవతరణ దినోత్సవం సాక్షిగా అవమానం
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ములుగు ఎమ్మెల్యే సీతక్కకు ఘోర పరాభవాన్ని చవి చూడాల్సి వచ్చింది. కారణం ఆమె అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కాకపోవటమే . ఒక ప్రజా ప్రతినిధిగా తెలంగాణా ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హాజరైన ఆమెకు సరైన గౌరవం దక్కలేదు . వేదికపై తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.. ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో ముఖ్యఅతిథిగా శాసనమండలి విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.ఆయన ప్రసంగిస్తుండగా వేదిక ఎక్కిన ఎమ్మెల్యే సీతక్కకు అక్కడ మరో కుర్చీ కనిపించలేదు. కనీసం అధికారులు సైతం ఆమెను ఆహ్వానించలేదు . దీంతో వెంటనే దిగొచ్చిన సీతక్క మీడియా గ్యాలరీలో కొద్దిసేపు కూర్చొని వెళ్లిపోయారు.
సీతక్కను వేదికపైకి ఆహ్వానించని అధికారులు .. ఆదివాసీని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేసిన సీతక్క
రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీతక్కను అధికారులు వేదికపైకి ఆహ్వానించక పోవటంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఆదివాసీని కాబట్టే అధికార పార్టీ నాయకులు తనను కావాలనే అవమానించారని సీతక్క ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలకు అధికారులు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. తనను అవమానిస్తే ములుగు నియోజకవర్గ ప్రజలను అవమానించినట్లేనని స్పష్టం చేశారు.దొడ్డి దారిన వచ్చిన వారికే విలువ ఇస్తున్నారని ఆమె పేర్కొన్నారు .
అధికార పార్టీ ఎమ్మెల్యే కాకపోవటంతో నియోజకవర్గంలో సీతక్కకు అడగడుగునా ఇబ్బందులు
గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీతక్క టీఆర్ఎస్ అభ్యర్థి మాజీ మంత్రి చందులాల్పై 18,423 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. ఆ తర్వాత ఆమె టీఆర్ఎస్ లో చేరతారని ప్రచారం జరిగినప్పటికీ ఆమె మాత్రం కాంగ్రెస్ పార్టీకే కట్టుబడి ఉన్నారు. రేవంత్ రెడ్డి టీం గా కాంగ్రెస్ పార్టీలో చేరిన సీతక్క గతంలో తెలుగుదేశం పార్టీ నుండి ఎమ్మెల్యేగా ములుగు ప్రజలకు సేవలందించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల నుండి అవమానాలు ఎదుర్కొంటున్నారు . కాంగ్రెస్ నుండి గెలిచిన నియోజక వర్గ ఎమ్మెల్యేగా సమస్యల పరిష్కారానికి ఎదురీదుతున్నారు.