9నెలల చిన్నారి శ్రీహిత కోసం పెట్టిన బ్యానర్లను తొలగించిన స్థానికులు .. ఆ చిన్నారి హత్యకేసు కంచికేనా
ఓరుగల్లులో మానవ మృగం ఓ తొమ్మిది నెలల చిన్నారి శ్రీహిత పై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి చిన్నారి ప్రాణం తీసిన ఘటన సభ్య సమాజాన్ని ఆవేదనకు గురి చేసింది . ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుని ఆ కామాంధుడిని ఉరి తియ్యాలని డిమాండ్ చేసినా , ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చెయ్యాలని కోరినా సర్కార్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ఇక ఇదే సమయంలో అసహనంతో ఉన్న స్థానికులు న్యాయం జరగదని భావిస్తూ శ్రీ హిత కోసం వరనగల్ నగరంలో ఏర్పాటు చేస్తున్న బ్యానర్లను తొలగించారు. ఇలాంటి ఎన్ని దారుణాలు జరిగినా ఎవరికీ పట్టింపు లేదని, చర్యలు శూన్యమని ఆవేదన చెందుతున్న ప్రజలు ఇక న్యాయం జరగదా? పసిమొగ్గల బతుకులు కూడా ఇంతేనా అని నిరాశా నిస్పృహల్లో ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
అర్దరాత్రి మంటల్లో కాలుతూ హాహాకారాలు చేసిన కావ్య కేసులో వీడిన మిస్టరీ
శ్రీహితకు న్యాయం కావాలని డిమాండ్ చేస్తూ బ్యానర్లు .. కామాంధుడికి శిక్ష ఇంకెన్నడు ?
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని టైలర్ స్ట్రీట్ లోని పాలచందాలో 9 నెలల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై ఓరుగల్లులో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి . కామాంధుడిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి . మరొకరు ఇలా చేయకుండా ఉండాలంటే ఆ కామాంధుడికి ఉరి శిక్ష వేయాలని అందరూ ముక్త కంఠంతో కోరారు . చిన్నారికి న్యాయం కావాలని నగరంలో బ్యానర్లు ఏర్పాటు చేశారు. కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. ప్రజా ప్రతినిధులను నిలదీశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్ని చేసినా, ఎంత చేసినా బాలిక పాశవిక దాడిలో ప్రాణం పోగొట్టుకుంది కానీ 9 నెలల చిన్నారిని రేప్ చేసి చంపిన వాడికి మాత్రం ఇంకా శిక్ష పడలేదు.
శ్రీహిత కోసం పెట్టిన బ్యానర్లను తొలగిస్తున్న స్థానికులు... మా ఇంట్లోనూ చిన్న పిల్లలు ఉన్నారంటున్న స్థానికులు
ఇక ఆ బ్యానర్లను ప్రతిరోజూ చూస్తున్న స్థానికులకు భయం పట్టుకుంది. శ్రీహిత బ్యానర్ చూసినప్పుడల్లా వాళ్ళ గుండెల్లో గుబులు పట్టుకుంటుంది. తమ ఇళ్ళల్లో ఉన్న చిన్నారుల రక్షణ ఎలా అనేది ఒక ప్రశ్నగా మారుతుంది. అనుక్షణం ఆ బ్యానర్లు మన పాలకుల అసమర్ధతను కళ్ళకు కడుతున్నాయి. చిన్నారికి ఎలాంటి న్యాయం జరిగింది అని ప్రశ్నిస్తున్నాయి. ఆడపిల్లల రక్షణ మన రాష్ట్రంలో మృగ్యమేనా అన్న భావన కలుగుతుంది. దీంతో స్థానికులు శ్రీహిత బ్యానర్లు చూస్తూ ప్రతి క్షణం నరకం అనుభవించలేమని భావించి ఆ బ్యానర్లను తీసి వేశారు. పాపకు ఏం న్యాయం జరిగిందని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బ్యానర్లను చూస్తే అయినా శ్రిహితకు జరిగిన అన్యాయం కోసం పోరాటం చేస్తారని కొందరు భావిస్తుంటే , అలా మరే చిన్నారికి జరగకూడదని, ఆ బ్యానర్లు చూస్తే తమ పిల్లల పరిస్థితి ఏంటి అన్న భయం కలుగుతుంది అని స్థానిక మహిళలు చెప్తున్నారు.
చిన్నారి రేప్ నిందితుడికి శిక్ష పడితేనే ఉపశమనం .. లేకుంటే మహిళల్లోనూ అసహనం
ఇక చిన్నారి మీద అత్యాచారం చేసిన ప్రవీణ్ మీద గతంలో రెండు అత్యాచారాల కేసులున్నాయని తెలిసినా , గతంలో మహిళలను కూడా ప్రవీణ్ లైంగిక వేధింపులకు గురి చేశాడని స్థానికులు చెప్పినా ఇప్పటి వరకు అతడి మీద ఎలాంటి చర్య తీసుకోలేదు . దీంతో శ్రీహిత కేసు కనుమరుగు అవుతుందా?నిందితుడికి శిక్ష పడుతుందా ? పడినా అది ఎంత కాలానికి అన్న ప్రశ్న ప్రస్తుతం అందరి ముందు ఉంది. ఇక శ్రీహిత బ్యానర్ల తొలగింపు మానవత్వం లేకుండా చేసిన చర్య అని కొందరు భావిస్తే , మరికొందరు శ్రీహిత ఉదంతం జనాల్లో క్రియేట్ చేసిన భయం అలాంటిది అన్న భావన వ్యక్తం అవుతుంది. ఏది ఏమైనా ఇప్పటికైనా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి చిన్నారిని రేప్ చేసి చంపిన నిందితుడికి కఠిన శిక్ష వెయ్యాల్సిన అవసరం ఉంది. లేకుంటే చిన్నారి హత్యకేసు కంచికే అన్న ఆలోచన ప్రజలకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. మనుషుల్లో ఉండాల్సిన మానవత్వం కూడా లేకుండా చేస్తుంది.