తగ్గని ఎన్నికల వేడి.. కొట్లాటలకు తెర.. కాంగ్రెస్ నేతపై దాడి
భూపాలపల్లి జిల్లా : ఎన్నికలు ముగిసినా ఆయా పార్టీల మధ్య వేడి తగ్గడం లేదు. గెలుపోటములు పక్కన పెట్టకుండా ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. శాయంపేట మండలంలోని కాట్రపల్లిలో మంగళవారం రాత్రి జరిగిన ఘటన కలకలం రేపుతోంది. కాంగ్రెస్ పార్టీ గ్రామాధ్యక్షుడు అజ్మీరా రఘుసింగ్ ఇంటిపై దాడి జరగడం చర్చానీయాంశమైంది. టీఆర్ఎస్ నేతలతో పాటు గండ్ర సత్యనారాయణరావు వర్గీయులు దాడిచేసినట్లు ఆరోపిస్తున్నారు రఘుసింగ్.
సరిగ్గా 1.25 గం.కు రెండోసారి తెలంగాణ రాష్ట్ర సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం, మంత్రిగా ఒక్కరు ప్రమాణం
భూపాలపల్లి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి గెలుపొందిన సందర్భంలో పార్టీ కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. అదే సమయంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందన్న సంతోషంతో ఆ పార్టీ కార్యకర్తలు కూడా సంబరాల్లో మునిగిపోయారు. ఈక్రమంలో గండ్ర సత్యనారాయణరావు అనుచరులు, కాట్రపల్లి కాంగ్రెస్ అధ్యక్షుడు అజ్మీరా రఘుసింగ్ తో గొడవ పడ్డారు. అయితే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలకు సర్ధిచెప్పి పంపించేశారు.
అక్కడితో ఆ గొడవ సద్దుమణిగింది అనుకుంటున్న తరుణంలో మంగళవారం రాత్రి గండ్ర సత్యనారాయణరావు వర్గీయులు, టీఆర్ఎస్ నేతలు మద్యం సేవించి కత్తులు కటార్లతో తన ఇంటిపై దాడి చేశారని ఆరోపిస్తున్నారు రఘుసింగ్. ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేయడమే గాకుండా తన తల్లి, భార్యపై కూడా దాడికి దిగారని.. పోలీసులు రావడంతో వారు పారిపోయారని చెబుతున్నారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చేలోగా నిందితులు పారిపోయారని అంటున్నారు.
ఈ ఘటనపై భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి స్పందించారు. తాను గెలిచాననే అక్కసుతో ఓడిపోయినవారు ఇలా దాడులకు దిగడమేంటని ప్రశ్నించారు. రఘుసింగ్ ఇంటికి వెళ్లి దాడికి సంబంధించిన వివరాలు అడిగారు. ఎలక్షన్లలో గెలుపోటములు సహజమని.. ఇలా దాడులకు దిగడం సరికాదన్నారు.