వరంగల్ను ఇంకా విభజించండి.. మరో 2 జిల్లాలు కావాలి.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే డిమాండ్
వరంగల్ : తెలంగాణ రాష్ట్రం సిద్ధించి టీఆర్ఎస్ ప్రభుత్వం కొలువుదీరాక.. పరిపాలన సౌలభ్యం కోసం 10 జిల్లాలను 33 జిల్లాలుగా విభజించారు సీఎం కేసీఆర్. తొలుత 31 జిల్లాలు ప్రకటించినప్పటికీ.. మరో రెండు జిల్లాల కోసం ఆందోళనలు వెల్లువెత్తడంతో వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల వేళ హామీ ఇచ్చిన కేసీఆర్.. రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేశాక ఆ రెండు జిల్లాలను కూడా ప్రకటించారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ మరో రెండు జిల్లాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు దానికి కట్టుబడి.. కొత్తగా ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేశారు. దాంతో మొత్తం 33 జిల్లాలయ్యాయి.
కలిసిరాని అసెంబ్లీ.. ఊపు తెప్పించిన లోక్సభ.. ఇక మున్సిపల్ పోరులో నిలిచి గెలిచేనా?
తెలంగాణలో ఇప్పటికే 33 జిల్లాలు అయినప్పటికీ కొన్నిచోట్ల కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఆ క్రమంలో వరంగల్ తూర్పు నియోజక వర్గాన్ని హెడ్ క్వార్టర్స్ గా వరంగల్ జిల్లాను ఏర్పాటు చేయాలని, హన్మకొండను మరో జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. స్వయంగా అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఈ డిమాండ్ తెరపైకి తేవడం గమనార్హం. ఆ మేరకు ఆయన ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కి విజ్ఞప్తి చేశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాను ఇప్పటికే ఆరు జిల్లాలుగా విభజించారు. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాలతో పాటు జనగాం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహాబూబాదాద్ జిల్లాలుగా ఏర్పాటు చేశారు. అయితే తాజాగా మరో రెండు జిల్లాలు కావాలంటూ సాక్షాత్తూ అధికార పార్టీ ఎమ్మెల్యే డిమాండ్ చేస్తుండటం చర్చానీయాంశమైంది.