ఐపీ పెట్టిన వ్యాపారి.. దిక్కుతోచని స్థితిలో అన్నదాత
ఆరుగాలం శ్రమించి వ్యవసాయం చేసి తీరా పంట చేతికి వచ్చాక పంటను అమ్ముకుందామని మార్కెట్ కు వచ్చిన రైతులు వ్యాపారుల చేతిలో నిలువునా మోసపోతున్నారు. కొందరు వ్యాపారులు రైతుల వద్ద నుండి పంట కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. మరికొందరు ఏకంగా ఐపి పెట్టి రైతుల కడుపు కొడుతున్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు ఆదుకునే వారి కోసం దీనంగా చూస్తున్నారు.
నా రాజకీయ జీవితంలో ఇలాంటి అరాచకాలు చూడలేదని ఆవేదన ..నెల్లూరు కూల్చివేతలపై బాబు
వరంగల్ ఎనుమాముల మార్కెట్ లో ఆరు కోట్ల 50 లక్షలకు ఐపీ పెట్టిన పసుపు వ్యాపారి..
ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన వరంగల్ ఎనుమాముల మార్కెట్ లో రైతులు మోసపోవడం నిత్యకృత్యం అయిపోయింది. రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన పసుపు పంటను విక్రయించడానికి వచ్చిన రైతులను ఓ వ్యాపారి నిలువునా ముంచారు. ఎంతోకాలంగా పసుపు రైతుల నుండి పసుపు కొనుగోలు చేస్తున్న మహేందర్ రెడ్డి అనే వ్యాపారి ఏకంగా ఆరు కోట్ల 50 లక్షల రూపాయలకు ఐపీ పెట్టాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, రైతులకు చెల్లించాల్సిన డబ్బు చెల్లించే పరిస్థితిలో తాను లేనని, తననెవరూ ఇబ్బందులకు గురి చేయవద్దని 40 మంది రైతులకు కోర్టు నుండి ఐపీ నోటీసులు పంపారు. దీంతో అన్నదాతలు ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఐపీ పెట్టిన వ్యాపారి నోటీసులతో దిక్కుతోచని అన్నదాతలు ... పట్టించుకోని మార్కెట్ వర్గాలు
విత్తనం విత్తిన నాటి నుండి, పంట చేతికొచ్చే వరకు పడరాని పాట్లు పడుతున్న అన్నదాతలు విత్తనాలు కొనుగోలు చేసే నాటి నుండి వ్యవసాయం చేసే క్రమంలో ప్రతీచోట దగా పడుతున్నారు. అతివృష్టి అనావృష్టి లతో పంట చేతికొచ్చే వరకు దిన గండం నూరేళ్ళు ఆయుష్షు అన్నట్టుగా బ్రతుకు వెళ్లదీస్తున్నారు. ఇక తీరా పంట చేతికి వచ్చాక మార్కెట్లో అమ్ముకోవడానికి వచ్చి మార్కెట్లోనూ మోసపోతున్నారు. మార్కెట్లో ధరలు లేక, దళారీల మోసంతో దగా పడుతున్న రైతులు కొందరైతే, ఇలా ఐ పీ పెడుతున్న వ్యాపారులతో నిలువునా మునుగుతున్న రైతులు ఇంకొందరు. మార్కెట్ కు వచ్చాక రైతులకు నష్టం జరిగినా , కష్టం కలిగినా స్పందించాల్సిన మార్కెట్ వర్గాలు అవేవీ పట్టించుకోవు .. ఫలితంగా రైతన్నలు మోసపోతున్నారు. ఇక ఐపీ పెట్టన కేసుల్లో మేమేమీ చెయ్యలేమని చేతులెత్తేస్తున్నారు.
నిజంగా వ్యాపారి నష్టపోయాడా ? లేదా రైతన్నలను ఐపీ పేరుతో మోసం చేస్తున్నాడా
మార్కెట్ లో వ్యాపారులు ఐపీ పెట్టిన సమయాల్లో నిజంగానే వ్యాపారి నష్టపోయాడా... లేదా నష్టపోయినట్లు గా ఐపీ పెట్టి రైతులను మోసం చేస్తున్నాడా అన్నదానిపై అటు మార్కెట్ అధికారులు కానీ, చాంబర్ ఆఫ్ కామర్స్ కానీ ఇప్పటివరకూ పట్టించుకున్న దాఖలాలు లేవు. చాలామంది వ్యాపారులు ముందు ఐపీ పెట్టి తర్వాతి కాలంలో తిరిగి దర్జాగా మార్కెట్లో తిరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక తాజాగా మహేందర్ రెడ్డి వ్యవహారంలో అయినా రైతులు నష్టపోకుండా మార్కెట్ వర్గాలు దృష్టి పెట్టి అన్నదాతల సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నం చెయ్యాల్సిన అవసరం ఉంది.