మురుగునీళ్లలో కొత్తిమీర.. డర్టీ వ్యాపారం.. ప్రజారోగ్యం గాలికొదిలేసిన అధికారులు !!(వీడియో)
Recommended Video
వరంగల్ కూరగాయల మార్కెట్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కూరగాయలు అమ్ముతున్న వ్యాపారులు మురుగు నీటిలో కొత్తిమీరను కడుతున్న దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డ్రైనేజీ వాటర్లో కొత్తిమీరను కడుతున్న దృశ్యం వరంగల్ జిల్లాలో కలకలం రేపుతోంది. ప్రజారోగ్యం పట్టింపు లేని మార్కెట్ అధికారులపైనా , వరంగల్ నగరపాలక సంస్థ అధికారులపైనా ఆగ్రహం వ్యక్తం అవుతుంది.
ఏపీతో పాటు ఏడు రాష్ట్రాల్లో హై అలెర్ట్ .. పుల్వామా తరహా ఉగ్రదాడులకు స్కెచ్
వరంగల్ కూరగాయల మార్కెట్ లో అపరిశుభ్ర పరిసరాలలో మురుగునీటి మధ్యే కూరగాయల విక్రయం
వరంగల్ జిల్లా లక్ష్మీపురం కూరగాయల మార్కెట్లో మామూలుగానే పరిస్థితులు దారుణంగా ఉంటాయి. ఒకపక్క పశువులు, మరోపక్క పందులతో నిత్యం కూరగాయల మార్కెట్ అపరిశుభ్రంగా కనిపిస్తుంది. కుళ్ళిన కూరగాయల కుప్పలతో, ముక్కుపుటాలదిరిపోయే వాసనతో మార్కెట్ కు వెళ్లాలంటేనే చిరాకు కలిగిస్తుంది. ఇక వర్షాకాలంలో పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు. ఇప్పటికే మార్కెట్ కు సంబంధించి దుకాణాల వసతి సరిగా లేక చాలామంది షెడ్లలో కాకుండా బయట పెట్టి కూరగాయలను ఆకుకూరలను విక్రయిస్తున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో మార్కెట్ పరిసరాలన్నీ వర్షపు నీరు, డ్రైనేజీ కలిసి చాలా అపరిశుభ్రంగా తయారయ్యాయి.
మురుగునీటిలోనే కొత్తిమీర కడిగి అమ్ముతున్న దృశ్యం వైరల్ ... ప్రజారోగ్యంతో చెలగాటమని ప్రజల ఆందోళన
వరంగల్ కూరగాయల మార్కెట్ లో వ్యాపారం చేసే వ్యాపారులు నీటి లభ్యత కూడా సరిగా లేక, కొత్తిమీరను అక్కడ ప్రవహిస్తున్న మురుగు నీటిలో కడిగి అమ్ముతున్నారు . ఇది చూసిన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్కి వస్తున్న వారు ఇది చూసి కూరగాయలు కొనకుండా వెనుదిరుగుతున్నారు. తమ ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు.
మరోవైపు వ్యాపారస్తులు కొత్తగా కట్టిన షాపులను ఓపెన్ చేస్తే ఈ పరిస్థితి ఉండదని చెబుతున్నారు. మార్కెట్లో పరిస్థితులు చూసైనా స్పందించాలని, వ్యాపారస్తులు అడుగుతున్నారు. షాపులను తక్షణం వారికి అప్పగించి, నీటి లభ్యత కల్పించాలని నగరవాసులు సైతం డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ప్రజల ఆరోగ్యాలతో అటు వ్యాపారులే కాదు, ఇటు అధికారులు చెలగాటమాడిన వారవుతారని చెప్తున్నారు.
అధికారులూ స్పందించండి .. ప్రజారోగ్యాన్ని కాపాడండి అంటున్న నగరవాసులు
ఒకపక్క ఎక్కువగా పురుగుమందులు వాడటం వల్ల రసాయనాలు కలిసిన కూరగాయలను ఉప్పు నీటిలో బాగా కడిగి ఆ తర్వాతనే వండుకోవాలని సామాజిక కార్యకర్తలు, వైద్యులు చెప్తుంటే, ఇక రసాయనాలతో పాటుగా, మురుగును కూడా జోడించి ఎక్కడ లేని రోగాలను ప్రజలకు అంటగట్టే విధంగా కూరగాయల మార్కెట్ లో పరిస్థితులు ఉన్నాయి. కొత్తిమీరను మురుగు నీటిలో కడుగుతున్న వీడియో వైరల్ అవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చినప్పటికీ , కూరగాయల మార్కెట్ లో వర్షాకాలం ఈ తరహా తంతు నిత్యకృత్యమే . ఇప్పటికైనా వరంగల్ నగర పాలక సంస్థ అధికారులు స్పందిస్తారని, నగర ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు.