వరంగల్ ఆర్టీసీ సమ్మె తోపులాట.. మహిళ కొంగు లాగారంటూ.. సీపీ వివరణ
వరంగల్ : ఆర్టీసీ సమ్మె రోజురోజుకీ ఉధృతంగా మారుతోంది. శుక్రవారం నాటితో సమ్మె ఏడో రోజుకు చేరడంతో రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలో గురువారం నాడు వరంగల్లో ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన ఆందోళన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. సమ్మెలో భాగంగా హన్మకొండ చౌరస్తా సమీపంలో తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దాంతో కార్మికులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో వాగ్వాదం జరిగి తోపులాటకు దారి తీసింది.
అయితే ఆర్టీసీ కార్మికుల నిరసన సందర్భంగా.. మహిళా కార్మికుల పట్ల పోలీస్ అధికారులు అమానుషంగా ప్రవర్తించారనే ఆరోపణలు వచ్చాయి. లేడీ కానిస్టేబుల్స్ లేకుండా మహిళా కార్మికుల పట్ల అనుచితంగా వ్యవహరించారని ప్రజా సంఘాలు మండిపడ్డాయి. ఏసీపీ స్థాయి అధికారి మహిళా కార్మికురాలి చీర లాగారనే ఫోటోలు, వీడియోలు మీడియాలో ప్రసారం కావడంతో రచ్చ రచ్చయింది.
కేసీఆర్ మరో ఎత్తుగడ.. ఆర్టీసీ సమ్మె విఫలం చేయడానికేనా..! కార్మిక సంఘాల వ్యూహమేంటో?
అదలావుంటే నిరసన చేస్తున్న ఆర్టీసీ మహిళా ఉద్యోగినుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారనేది శుద్ధ అబద్దం అంటున్నారు వరంగల్ నగర పోలీస్ కమిషనర్. వాస్తవానికి విరుద్దంగా ప్రసార మాధ్యమాల్లో పోలీసులపై అసత్య ప్రచారం జరుగుతోందని.. అది నమ్మొద్దని కోరారు. ర్యాలీలో పాల్గొన్న మహిళా ఉద్యోగినుల పట్ల కాజీపేట ఏసీపీ అనుచితంగా ప్రవర్తించారనేది కరెక్ట్ కాదని వివరణ ఇచ్చారు.
ర్యాలీ సందర్భంగా తోపులాట చోటు చేసుకుందని.. ఆ సమయంలో జరిగిన ఘటనను తప్పుగా ప్రచురించారని, ప్రసారం చేశారని చెప్పుకొచ్చారు సీపీ. ఓ మహిళా ఉద్యోగిని సహచర ఉద్యోగిని కొంగును లాగే క్రమంలో బాధిత మహిళ పడిపోకుండా సాయం చేశారే తప్ప అందులో ఎలాంటి దురుద్దేశం లేదని వెల్లడించారు. కొంగు లాగుతున్న మహిళను అడ్డుకునే క్రమంలో బాధిత మహిళకు రక్షణగా నిలిచారే తప్ప అందులో అమానుషంగా ప్రవర్తించింది ఏమీ లేదని తెలిపారు.