వరంగల్లో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తం.. కార్మికులు, పోలీసుల తోపులాట.. మహిళ చీర లాగారని..!
వరంగల్ : ఆర్టీసీ సమ్మె ఉధృతంగా మారుతోంది. గురువారం నాటితో సమ్మె ఆరో రోజుకు చేరడంతో రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ఆందోళనలకు దిగారు. ఆయా జిల్లాల్లో నిరసన వ్యక్తం చేశారు. ఆ క్రమంలో వరంగల్లో ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వారిని నివారించే క్రమంలో వాగ్వాదం జరగడంతో పాటు తోపులాట చేసుకుంది. అయితే మహిళా కార్మికుల పట్ల పోలీస్ అధికారులు అమానుషంగా ప్రవర్తించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లేడీ కానిస్టేబుల్స్ లేకుండా మహిళా కార్మికుల పట్ల అనుచితంగా వ్యవహరించారని మండిపడుతున్నారు. ఏసీపీ స్థాయి అధికారి మహిళా కార్మికురాలి చీర లాగారనే ఫోటోలు, వీడియోలు మీడియాలో ప్రసారం కావడంతో ఆయనపై ఉద్యోగ సంఘాలు భగ్గుమంటున్నాయి.
వరంగల్లో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తం
ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె వరంగల్లో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమర వీరులకు గురువారం నాడు నివాళులు అర్పించిన కార్మికులు.. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఆ క్రమంలో వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది.
కేసీఆర్ మరో ఎత్తుగడ.. ఆర్టీసీ సమ్మె విఫలం చేయడానికేనా..! కార్మిక సంఘాల వ్యూహమేంటో?
పోలీసులు అతిగా ప్రవర్తించారని.. తోపులాట జరిగి
ఆర్టీసీ కార్మికుల నిరసన అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులు అతిగా ప్రవర్తించారనే వాదనలు వినిపిస్తున్నాయి. కార్మికులను అదుపులోకి తీసుకునే క్రమంలో ఇష్టానుసారంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాలర్ పట్టుకుని మరీ పోలీస్ వ్యాన్ ఎక్కించారని కార్మికులు వాపోతున్నారు. పోలీసులు, కార్మికుల మధ్య జరిగిన తోపులాటలో కొందరికి గాయాలయినట్లు తెలుస్తోంది.
మహిళల పట్ల అనుచితంగా.. ఏసీపీ మహిళ చీర లాగారని..!
ఈ సందర్భంగా మహిళల పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తున్నారు తోటి కార్మికులు. ఓ పోలీస్ అధికారి మహిళ చీర లాగారనే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. లేడీ కానిస్టేబుల్స్ లేకుండా మహిళా కార్మికులను ఎలా నిలువరిస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏసీపీ స్థాయి అధికారి అలా ప్రవర్తించడం సిగ్గుచేటని నెటిజన్లు ఫైరవుతున్నారు. మహిళా కార్మికుల పట్ల ఇలా దురుసుగా ప్రవర్తించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ మీడియాలో కూడా ప్రసారం కావడంతో సదరు ఏసీపీపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి.
ఆర్టీసీ సమ్మె.. హైకోర్టు విచారణ.. ప్రభుత్వానికి ప్రశ్నల వర్షం
సమ్మె యథాతథం.. సీఎం కేసీఆర్కు బుద్ది చెబుతామంటూ..!
అదలావుంటే సమ్మె యథాతథంగా కొనసాగుతుందని కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. ఆ క్రమంలో ఈ నెల 19వ తేదీన తెలంగాణ బంద్కు పిలుపునిచ్చింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం మెట్టు దిగి రాకపోవడంతో భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమయ్యారు జేఏసీ నేతలు. ఆర్టీసీ సమ్మెపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ మొండి వైఖరికి తగిన బుద్ది చెబుతామంటున్నారు.