ఉద్యోగాల పేరిట వల విసిరి.. లక్షల రూపాయలు కాజేసి.. దుబాయికి పరార్..!
వరంగల్ : విదేశాల్లో ఉద్యోగాలంటూ బురిడీ కొట్టించింది మరో సంస్థ. నిరుద్యోగులను నట్టేట ముంచింది. దుబాయ్లో ఉద్యోగం ఇప్పించే బాధ్యత మాదంటూ అందినకాడికి దండుకుంటున్నారు నిర్వాహకులు. సంస్థ ఎండీ స్థానికురాలే కావడంతో పూర్తిగా నమ్మారు బాధితులు. చివరకు లక్షల రూపాయలు పోగేసుకుని పత్తా లేకుండా పోయారు. కంపెనీకి తాళాలు వేయడంతో బాధితులు లబోదిబమంటున్నారు. చేతిలో డబ్బులు లేకున్నా అక్కడిక్కడ తీసుకొచ్చి వారి చేతిలో పోస్తే ఉద్యోగం మాట దేవుడెరుగు అప్పుల పాలయ్యామని వాపోతున్నారు. విషయం కాస్తా ఠాణా మెట్లెక్కడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
దుబాయ్లో ఉద్యోగాలంటూ నిండా ముంచి..!
చెప్పేవాడికి వినేవాడు లోకువ అన్నట్లుగా తయారైంది నిరుద్యోగుల పరిస్థితి. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మరో సంస్థ బోర్డు తిప్పేసిన ఘటన వరంగల్లో చోటు చేసుకుంది. దేశాయిపేట ప్రాంతంలో ట్రిమ్విజన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ సంస్థ వెలిసింది. దుబాయ్ లాంటి దేశాల్లో ఉద్యోగాలు ఇప్పించడమే తమ పనిగా పేర్కొంటూ బాధితుల నుంచి అడ్డగోలుగా లాగేశారు నిర్వాహకులు. చివరకు వారు పత్తా లేకుండా పోవడంతో బాధితులు లబోదిబమంటున్నారు. ఆ క్రమంలో బుధవారం సాయంత్రం సదరు సంస్థ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అంతవరకు కూడా నిర్వాహకులు బాగోతం బయటపడకపోవడం గమనార్హం.
మొదటి ప్రియుడు అత్యాచారం.. రెండో ప్రియుడు అబార్షన్.. తల్లిని చంపిన కేసులో కొత్త కోణం..!
స్థానికురాలని నమ్మితే మోసం చేసి..!
విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ప్రకటనలు గుప్పించిన ట్రిమ్విజన్ నిర్వాహకులు పెద్ద ఎత్తున వసూలు చేశారు. మట్టెవాడకు చెందిన సీహెచ్ స్నేహలత అనే మహిళ ఆధ్వర్యంలో దేశాయిపేటలో సంస్థ కార్యాలయం ఏర్పాటైంది. దుబాయ్లో ఉద్యోగం నూటికి నూరు శాతం గ్యారంటీ అంటూ ప్రకటనలు గుప్పించిన నిర్వాహకులు చివరకు బోర్డు తిప్పేశారు. ఆ క్రమంలో బాధితుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారు. ట్రిమ్విజన్ సంస్థ మోసపూరిత ప్రకటనలకు ఆకర్షితులైన చాలామంది నిరుద్యోగులు సంస్థ నిర్వాహకులను ఆశ్రయించారు. అలా వందలాది మందిని నట్టేట ముంచి పత్తా లేకుండా పోయారు.
పెద్ద మొత్తంలో జీతాలంటూ ఊరించి
దుబాయ్లో ఉద్యోగాలంటూ ట్రిమ్విజన్ సంస్థ నిర్వాహకులు నిరుద్యోగులను నట్టేట ముంచారు. పెద్ద మొత్తంలో జీతాలు అంటూ ఊరించారు. అలా దాదాపు 200కు పైగా బాధితుల నుంచి 20 వేల రూపాయలు మొదలు 60 వేల రూపాయల వరకు వసూలు చేశారు. అయితే స్నేహలత స్థానికురాలే కావడంతో చాలామంది ఆమెను గుడ్డిగా నమ్మారు. ఆమె చెప్పిందే వేదంలా ఫాలో అయ్యారు. ఉద్యోగం కోసం ఆశపడి ఆమె అడిగినంత ఇచ్చుకున్నారు. ఎనిమిది నెలలుగా ఇదే తంతు కొనసాగించి పలువురి నుంచి లక్షల రూపాయలు పోగేసుకుని పత్తా లేకుండా పోయారు నిర్వాహకులు.
దుబాయ్ పారిపోయినట్లు అనుమానం.. కేసు నమోదు
ట్రిమ్విజన్ సంస్థ నిర్వాహకులు అడిగినంత డబ్బు ఇచ్చిన నిరుద్యోగులు విద్యార్హతలకు సంబంధించి ఒరిజినల్ సర్టిఫికెట్లు, పాస్పోర్టులు కూడా సమర్పించారు. అయితే వీసా అప్పుడొచ్చే, ఇప్పుడొచ్చే అంటూ కాలాయాపన చేస్తూ దాదాపు ఆరు నెలలకు పైగా బాధితులను సంస్థ కార్యాలయం చుట్టూ తిప్పుకున్నారు. కొందరు ఆలస్యమవుతోందని, ఉద్యోగాలు వస్తాయా రావా అని నిలదీస్తే.. ముప్పై మందికి డబ్బు వాపసు ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి 60 లక్షల రూపాయల వరకు పోగేసుకుని దుబాయ్కి పారిపోయినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో బుధవారం నాడు కొందరు బాధితులు సంస్థ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. దాంతో రంగంలోకి దిగిన ఇంతెజార్ గంజ్ పోలీసులు బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకుని స్నేహలతపై కేసు నమోదు చేశారు.
పక్కింటి కుర్రాడితో అలా.. మద్యం తాగి.. కన్నతల్లి హత్య కేసులో మరెన్నో ట్విస్టులు..!
మాయ మాటలు నమ్మి ఉన్న ఉద్యోగాలు వదులుకుని..!
ట్రిమ్విజన్ నిర్వాహకులు మాయ మాటలు నమ్మి కొందరు ఉన్న ఉద్యోగాలు కూడా వదులుకున్నారు. దుబాయ్లో ఉద్యోగం.. పెద్ద మొత్తంలో జీతం అంటూ ఆశపడితే చివరకు ఉన్న ఉద్యోగానికే ఎసరు వచ్చింది. తీరా సదరు సంస్థ బోర్డు తిప్పేయడంతో ఇప్పుడు లబోదిబమంటున్నారు. అటు దుబాయ్లో ఉద్యోగం రాక.. ఇటు ఉన్న ఉద్యోగం పోయి దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.