మంత్రివర్గ విస్తరణతో అసంతృప్తుల సెగ?.. తారక మంత్రం ఫలించేనా?
వరంగల్ : మంత్రివర్గ విస్తరణ టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తుల పర్వానికి దారి తీస్తోందా? మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలకు.. సీన్ రివర్స్ కావడంతో ఏం చేయాలో తోచడం లేదా? వరంగల్ జిల్లాలో ప్రస్తుత టీఆర్ఎస్ పరిస్థితేంటి? పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా తారకరాముడి మంత్రదండం ఏవిధంగా పనిచేయనుంది? ఇలాంటి సవాలక్ష ప్రశ్నలకు ఈ నెల 7న కేటీఆర్ జిల్లా పర్యటన సమాధానం చెప్పబోతోంది.
సప్పుడు లేదు, కాలుష్యం లేదు.. ఇవాళ్టి నుంచే కొత్త ఎలక్ట్రిక్ బస్సులు
ఆది నుంచి గులాబీ నీడలోనే..!
ఉద్యమ ప్రస్థానం మొదలు తెలంగాణలో వరంగల్ జిల్లా ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి గులాబీ బాస్ కేసీఆర్ వెంట నడుస్తున్న నాయకులెందరో ఈ గడ్డపై ఉన్నారు. ఆ లెక్కన కేసీఆర్ సారథ్యంలో తమకు సముచితమైన ప్రాధాన్యం దక్కుతుందని భావించేవారు చాలామందే. అలాంటిది మొన్నటి మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు ఒకే ఒక్క బెర్త్ ఇవ్వడం ఆశావహులను నిరాశకు గురిచేసింది. 2014లో ఏర్పడ్డ తొలి తెలంగాణ ప్రభుత్వంలో జిల్లాకు సముచితమైన స్థానం లభించింది. అత్యున్నతమైన స్పీకర్ కుర్చీతో పాటు, రెండు మంత్రి పదవులు దక్కాయి.
రవళి కుటుంబాన్ని ఆదుకుంటాం.. నిందితుడిని శిక్షిస్తాం : మంత్రి ఎర్రబెల్లి
ఆశ.. సీన్ రివర్స్
టీఆర్ఎస్ కు రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం రావడంతో.. జిల్లా నేతలు మంత్రి పదవులపై భారీగానే ఆశలు పెట్టుకున్నారు. కానీ సీన్ రివర్సయింది. పెద్దాయన ఆలోచన మేరకు జిల్లాకు ఒకే ఒక్క మంత్రి పదవి దక్కింది. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన కడియం శ్రీహరిని పక్కనబెట్టి ఈసారి ఎర్రబెల్లి దయాకర్ రావుకు పెద్దపీట వేశారు. వినయ్ భాస్కర్, ఆరూరి రమేశ్, రెడ్యా నాయక్ తదితరులు మంత్రి కుర్చీపై ఆశలు పెట్టుకున్నా.. చివరకు నిరాశే మిగిలింది. మంత్రి పదవిపై గంపెడాశలు పెట్టుకున్న కొందరైతే ఆ షాక్ నుంచి ఇంకా తేరుకున్నట్లు కనిపించడం లేదు.
పోయినసారి 3.. ఈసారి ఒకటేనా?
జిల్లాకు రెండు మంత్రి పదవులు దక్కుతాయని చాలామంది భావించారు. ఎర్రబెల్లికి మంత్రి పదవి కన్ఫామ్ అన్నట్లుగా మొదట్నుంచి ప్రచారం జరిగింది. అదే క్రమంలో ఒక యువనేతకు కూడా మంత్రి పదవి దక్కనుందనే వార్తలొచ్చాయి. కానీ మంత్రివర్గ విస్తరణ నాటికి సీన్ రివర్సయింది. ఒక ఎర్రబెల్లికే మంత్రి పదవి కట్టబెట్టారు గులాబీ బాస్. ఆ క్రమంలో సహజంగానే అసంతృప్తి స్వరాలు వినిపించాయి. అవి బయటకు వినిపించకున్నా.. నేతల మాటతీరును తేటతెల్లం చేశాయి. అయితే అసంతృప్తులను బుజ్జగించేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారకరాముడు రంగంలోకి దిగారట. మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నోళ్లకు భవిష్యత్తులో అండగా ఉంటానంటూ అభయమిచ్చారట. అలా ఆయా నేతలపై తారకమంత్రం బాగానే పనిచేసిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
అసంతృప్తి సెగ చల్లారేనా? కేటీఆర్ పర్యటనపై ఆసక్తి
ఈనెల 7వ తేదీ గురువారం వరంగల్ జిల్లా పర్యటనకు వస్తున్నారు కేటీఆర్. ఆయన టూరును విజయవంతం చేసే బాధ్యతను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు భుజానికెత్తుకున్నారు. పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సన్నాహాక సమావేశం కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి 3 వేల మంది ముఖ్య కార్యకర్తలు హాజరయ్యే విధంగా చూడాలని నేతలకు పిలుపునిచ్చారు.
కేటీఆర్ పర్యటన సందర్భంగా ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కమిటీలను నియమించారు. ఆ మేరకు రెండు మూడు రోజుల కిందటే హన్మకొండలోని తన నివాసంలో పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతో పాటు ముఖ్యనేతలతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసంతృప్తుల బెడద కనిపించకుండా దాదాపు అందరు నాయకులు వచ్చారు. మొత్తానికి మంత్రివర్గ విస్తరణ అసంతృప్తి రాజేసిప్పటికీ.. తారకరాముడి మంత్రదండంతో అందరూ ఏకతాటిపై నడిచేలా కనిపిస్తున్నారు. అదలావుంటే కేటీఆర్ పర్యటన తర్వాత అసలు విషయమేంటో తెలుస్తుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.