లండన్లో తెలుగు విద్యార్థి హఠాన్మరణం.. లాక్డౌన్తో విమానాలు బంద్.. తల్లిదండ్రుల్లో ఆందోళన..
ఉన్నత చదువుల కోసం నాలుగు నెలల కిందటే లండన్ వెళ్లిన తెలుగు విద్యార్థి ఒకరు అనూహ్యరీతిలో ప్రాణాలు కోల్పోయాడు. వరంగల్ జిల్లా ఐనవోలు మండలం రాంనగర్ కు చెందిన కైతా సతీశ్(26) ఆదివారం తన ఫ్లాట్ లో గుండెపోటుతో చనిపోయాడు. లండన్ పోలీసులు, సతీశ్ స్నేహితులు, బంధువులు చెప్పిన వివరాల ప్రకారం.. కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో తన ఫ్లాట్ కే పరిమితమైపోయిన అతనికి నిద్రలోనే గుండెనొప్పి రావడంతో కిందపడిపోయాడు. ఎంతకూ తలుపు తెరవకపోయేసరికి రూమ్ మేట్స్ పోలీసులకు ఫోన్ చేశారు. తలుపులు బద్దలుకొట్టి అతణ్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే ప్రాణాలు పోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
సతీశ్ మరణవార్తతో అతని స్వస్థలమైన రాంనగర్ లో విషాదకర వాతావరణం నెలకొంది. మెన్న జనవరిలోనే అతను లండన్ వెళ్లాడని, శనివారం రాత్రి కూడా ఫోన్లో మాట్లాడాడని, కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తగా ఇంట్లోనే ఉంటున్నానని, తమను కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు అతని తల్లిదండ్రులు చెప్పారు. సతీశ్ తమ్ముడు దేవేందర్ కూడా యూకేలోనే చదువుతున్నాడు. అన్న రంజిత్ అమెరికాలో నివసిస్తున్నాడు.
లాక్ డౌన్ నేపథ్యంలో విమానాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన నేపథ్యంలో సతీశ్ మృతదేహాన్ని ఇండియాకు తెచ్చే విషయమై సందిగ్ధత నెలకొంది. ఈ విషయంలో సాయం చేయాల్సిందిగా మృతుడి తల్లిదండ్రుల, బంధువులు.. మంత్రి కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ లను అభ్యర్థించారు. ప్రస్తుతానికి అత్యవసర కార్గో విమానాలు తప్ప అంతర్జాతీయంగా ఫ్లైట్ సర్వీసులన్నీ రద్దయిన సంగతి తెలిసిందే.