హన్మకొండలో మహిళ దారుణ హత్య.. పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోనే
హన్మకొండ లో దారుణం జరిగింది. పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఒక మహిళ దారుణ హత్యకు గురైంది. హన్మకొండ టైలర్ స్ట్రీట్ లో దోరం శారద అనే మహిళ కూరగాయలు విక్రయించుకుంటూ కుమారుడితో కలిసి జీవనం సాగిస్తోంది. కొంతకాలం క్రితం భర్తతో గొడవపడి విడిగా ఉంటున్న శారదను గుర్తు తెలియని ఆగంతకులు దారుణంగా హతమార్చారు. ఆమెతో పాటు ఆమె కుమారుడిని కూడా తీవ్రంగా గాయపరిచారు .
రాత్రి నిద్రిస్తున్న సమయంలో,వారిపై విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చారు. శారద తలకు బలమైన గాయాలు కావడంతో శారద అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె కుమారుడు అఖిల్ తీవ్ర గాయాల పాలయ్యాడు. పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో జరిగిన ఈ హత్య ప్రస్తుతం హన్మకొండలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ వారిపై దాడికి పాల్పడింది ఎవరు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే శారద కుమారుడు అఖిల్ తీవ్ర గాయాల పాలై ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న నేపధ్యంలో పోలీసులు అతన్ని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు . ప్రస్తుతం అఖిల్ చికిత్స పొందుతున్నాడు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు. ఘటనకు కారణాలపై అక్కడి వారిని విచారిస్తున్నారు. శారద భర్తతో గొడవపడి ఒంటరిగా ఉంటున్న కారణంగా ఆమె భర్తనే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారు ఎవరు ? ఎంతమంది వీరిని హతమార్చడానికి ప్రయత్నం చేశారు? వంటి అన్ని కోణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.