కాంగ్రెస్ నుండి గెలిచి టీఆర్ఎస్ కు అమ్ముడుపోతారా ? ఫిరాయింపు నేతలను చెప్పుతో కొట్టిన మహిళ
తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం ప్రస్తుతం రచ్చ రచ్చ గా మారుతుంది. ఎమ్మెల్యేల నుంచి మొదలుపెడితే ఇటీవల ఎన్నికలు జరిగిన ఎంపిటిసిల వరకు పార్టీ ఫిరాయించడం తో కాంగ్రెస్ పార్టీ నేతలలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. పార్టీ ఫిరాయింపు చేసే నేతలకు తగిన శాస్తి చెయ్యాలన్నట్టు తాజాగా జరిగిన ఓ సంఘటన ఫిరాయింపు నేతలకు ఓ హెచ్చరికలా మారింది.
ఫిరాయింపు ఎంపీటీసీలపై చెప్పుతో దాడి చేసిన మహిళ
కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికల బరిలోకి దిగి హస్తం గుర్తు మీద గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీకి పార్టీ ఫిరాయింపు చేశారు. దీంతో టీఆర్ఎస్ ఎల్పి లో సీఎల్పీ ని విలీనం చేస్తూ అసెంబ్లీలో ప్రతిపక్ష లేకుండా చేశారు . ఇక దీంతో పార్టీలో ఆగ్రహజ్వాలలు మిన్ను ముడుతున్నాయి. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నిన్నగాక మొన్న గెలిచిన ఎంపీటీసీలు కూడా కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైపోయారు. ఎంపీపీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలిచిన ఎంపీటీసీలు గులాబీ గూటికి చేరాలని నిర్ణయించుకోవడంతో కాంగ్రెస్ కార్యకర్త ఫిరాయింపు ఎంపీటీసీ లపై చెప్పుతో దాడి చేసింది.
ఎంపీపీ ఎన్నికల నేపధ్యంలో కాంగ్రెస్ ఎంపీటీసీలను ప్రలోభపెట్టిన టీఆర్ఎస్
వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం లో జరిగిన ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ నుండి నర్సంపేట మండలంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 11 ఎంపీటీసీ స్థానాలకు గాను ఆరుగురు ఎంపీటీసీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయం సాధించారు. ఎంపీపీ ఎన్నికల నేపథ్యంలో ఎంపీపీ స్థానం దక్కించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీటీసీలు సహకారం అందించాలి . ఇక ఈ నేపధ్యంలో పార్టీ ఫిరాయించడానికి సిద్ధమయ్యారు వీరిలో ముగ్గురు ఎంపీటీసీలు . 30 లక్షలు ఇస్తాం అంటూ వారిని ప్రలోభ పెట్టి టిఆర్ఎస్ నాయకులు ఓటింగ్ కు తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తున్న క్రమంలో గ్రామస్తులు అడ్డుకున్నారు.
కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోతారా అంటూ చెప్పుతో దాడి చేసిన కాంగ్రెస్ మహిళా కార్యకర్త
ఇక ఈ సమయంలోనే ఓ మహిళా కార్యకర్త కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోతారా అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రామస్తులు సైతం మీకు ఓట్లేసి గెలిపిస్తే పార్టీ మారతారా అంటూ ఆ ఎంపీటీసిలను నిలదీశారు. టిఆర్ఎస్ కార్యకర్తలు గ్రామస్తులపై దాడికి దిగుతున్న తరుణంలో ఆ మహిళా కాంగ్రెస్ కార్యకర్త కోపోద్రిక్తురాలైంది. పార్టీ ఫిరాయిస్తున్న ఎం పి టి సి లను చెప్పుతో కొట్టింది. పోలీసులు అడ్డుకున్నా సరే పార్టీ మారిన ఎంపీటీసీలపై చెప్పుతో దాడి చేసి పరువు తీసింది. ఇక తాజాగా జరిగిన ఈ సంఘటన నేపధ్యంలో ఒకింత ఫిరాయింపు నేతలకు షాక్ కొట్టినట్లు అయ్యింది. ఓట్లేసి గెలిపించిన ప్రజలు ఫిరాయింపులపై తిరగబడితే ఎలా ఉంటుంది అన్న భావన ఈ సంఘటనతో అందరినీ ఆలోచింపజేస్తుంది.