ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి ఇంగ్లీష్ రాదట ... చాలా ఇబ్బంది పడుతున్నారట
ఏపీలో ఒకటో తరగతి నుండి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియా లో విద్యాబోధన చేయాలి అని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం రాజకీయ వివాదానికి కారణమైన విషయం తెలిసిందే. ఇంగ్లీషులో బోధన సామర్ధ్యం లేని టీచర్లతో ఏ విధంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నిర్వహిస్తారని ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అలాగే తెలుగు మీడియం తీసివేత నిర్ణయం కూడా సరైన నిర్ణయం కాదని అది మాతృభాషకు ద్రోహం చేసినట్టు అవుతుందని ఇప్పటికే అన్ని ప్రతిపక్ష పార్టీలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. అయినా సరే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఇంగ్లీష్ మీడియం స్కూల్ నిర్వహించి తీరుతామని తేల్చి చెప్పారు.
డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి మరో కీలక పదవి అప్పగించిన సీఎం జగన్ .. నక్క తోక తొక్కారుగా
ఇక ఇదే విషయంపై ఏపి డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి సైతం మాట్లాడారు. తనకు ఇంగ్లీష్ రాదని, అందువల్ల తాను చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆమె పేర్కొన్నారు. బూసరాజు పల్లి గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో జరిగిన మనబడి నాడు-నేడు కార్యక్రమంలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పుష్పశ్రీవాణి. ఇంగ్లీష్ రాకపోతే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని దానికి తానే ఒక ఉదాహరణ అని ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి అన్నారు.తన విద్యాభ్యాసం 10వ తరగతి వరకు తెలుగు మీడియంలో సాగిందని చెప్పిన ఆమె తాను ఇంగ్లీష్ మీడియంలో మూడు నెలలు ఇంటర్ చదివానని, ఆ తర్వాత చదవలేక మళ్లీ తెలుగు మీడియంలో చేరానని చెప్పుకొచ్చారు.
మొదటి నుండి ఇంగ్లీష్ మీడియం బ్యాక్ గ్రౌండ్ కాకపోవడంతో తాను పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావని ఆమె పేర్కొన్నారు. ఇక డిగ్రీ ఇంగ్లీష్ మీడియంలో చదివినప్పటికీ ఇంగ్లీషు భాషపై పట్టు సాధించలేకపోయానని తెలిపారు. ఇంగ్లీష్ రాకపోవడంతో ఇప్పుడెంతో ఇబ్బంది పడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం. విద్యార్థుల భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఇప్పటి విద్యార్థులకు అలాంటి ఇబ్బంది రాకూడదనే ఇంగ్లీష్ మీడియంను అమలు చేస్తున్నామని చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ నిర్వహించాలనే నిర్ణయాన్ని ప్రశంసించిన పుష్పశ్రీవాణి ఇంగ్లీష్ రాక తాను పడిన ఇబ్బందులను విద్యార్థులకు చెప్పుకున్నారు. అలాంటి ఇబ్బంది ఎవరికి ఎదురు కాకూడదని కోరుకుంటున్నట్లుగా తెలిపారు.