మాజీ మంత్రి పితాని సత్యన్నారాయణ మాజీ పీఎస్ మురళీమోహన్ సస్పెండ్ చేసిన సర్కార్ .. రీజన్ ఇదే !!
ఈఎస్ఐ స్కాం లో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాజీ పిఎస్ మురళీమోహన్ ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే . ఈఎస్ఐలో మందుల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న, ప్రస్తుతం ఏసీబీ అదుపులో ఉన్న మాజీ మంత్రి పితాని వద్ద మాజీ పిఎస్ గా ఉన్న మురళీమోహన్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
ఈఎస్ఐ స్కాం లో పితాని కుమారుడి కోసం గాలిస్తున్న ఏసీబీ .. అజ్ఞాతంలో సురేష్ .. టీడీపీకి మరో షాక్ !!
మున్సిపల్ శాఖ సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్న మురళీమోహన్ ను సస్పెండ్ చేస్తూ మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతి ఆరోపణల ఈ నేపథ్యంలో ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్నందుకు మురళీమోహన్ ను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈఎస్ఐ కుంభకోణం లో ఇప్పటికే చాలా మందిని విచారించిన ఏసీబీ అధికారులు ఈ కుంభకోణంలో ప్రధానంగా 19 మంది ప్రమేయం ఉన్నట్లుగా గుర్తించి, ఇప్పటికి పది మందిని అరెస్టు చేశారు.
టిడిపి హయాంలో ఈఎస్ఐ లో భారీ కుంభకోణం జరిగినట్లుగా గుర్తించిన ఏసీబీ అధికారులు కుంభకోణంతో ప్రమేయం ఉన్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడును అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ కుంభకోణంలో నాటి కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ పాత్ర కూడా ఉందని అనుమానిస్తున్న ఏసిబి ప్రస్తుతం దానిపై ఆరా తీస్తోంది. మాజీ మంత్రి పితాని పిఎస్ గా పనిచేసిన మురళీమోహన్ నుండి కూపీ లాగుతుంది . మురళీ మోహన్ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకపోయింది .మురళీమోహన్ ను సచివాలయంలో అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు ఆయనను విచారిస్తున్నారు.