ప్రేమ పెళ్లి చేసుకున్నారు... పెద్దల భయంతో ప్రాణాలు తీసుకున్నారు..
జంగారెడ్డిగూడెం : వాళ్లిద్దరు ప్రేమించుకున్నారు. జీవితాంతం కలిసి బతకాలని బాసలు చేసుకున్నారు. విషయం పెద్దలకు తెలిసి విడదీసే ప్రయత్నం చేశారు. ఎంత నచ్చజెప్పినా పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడంతో కఠిన నిర్ణయం తీసుకున్నారు. కలిసి బతకలేనప్పుడు చావులోనైనా ఒకటవ్వాలనుకున్నారు. గుడిలో పెళ్లి చేసుకుని 24 గంటలు గడవక ముందే పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నారు.
కీచకులు : యువతిని నిర్బంధించి గ్యాంగ్ రేప్.. పది రోజుల పాటు ప్రత్యక్ష నరకం చూపిన కామాంధులు.
ప్రేమగా మారిన స్నేహం
పశ్చిమ గోదావరి జిల్లాలోని బుట్టాయిగూడెం మండలం నూతిరామన్న పాలెం గ్రామానికి చెందిన శేఖర్, పోలవరం మండలం సరిపల్లి కుంటకు చెందిన పోశమ్మ స్నేహితులు. కొయ్యలగూడెం గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుతుండగా వారి మధ్య చిగురించిన స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితుల్లో పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని ఇరు కుటుంబాల్లో చెప్పారు. అయితే ఇందుకు పోశమ్మ కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. కూలిపనులు చేసుకునే వాడికి తమ పిల్లను ఇవ్వమని తెగేసి చెప్పారు.
పెళ్లికి ఒప్పుకోని పెద్దలు
పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో 2018 జనవరిలో ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయారు. పోశమ్మ కుటుంబసభ్యులు శేఖర్పై కొయ్యలగూడెం పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు పెట్టారు. పోశమ్మ మైనర్ కావడంతో వాళ్లు తిరిగొచ్చి ఎవరింటికి వాళ్లు వెళ్లిపోయారు. ఈ ఏడాది జూన్ 9కి పోశమ్మ మైనార్టీ తీరిపోవడంతో ముందు అనుకున్న ప్రకారం వాళ్లిద్దరూ శుక్రవారం సాయంత్రం మళ్లీ పారిపోయారు. జంగారెడ్డి గూడెం మండలం గుర్వాయిగూడెంలోని మద్ది ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకున్నారు. ఎవరికీ తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఈ సందర్భంగా శేఖర్ సెల్ఫోన్లో తీసుకున్న ఫొటోలను ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు.
లాడ్జిలో గది అద్దెకు తీసుకుని
పెళ్లి చేసుకున్న తర్వాత శేఖర్, పోశమ్మలు గుర్వాయిగూడెంలోని ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు. శనివారం ఉదయం లాడ్జి సిబ్బంది అనుమానంతో రూమ్ తలుపులు కొట్టినా తీయకపోవడంతో లక్కవరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడి చేరుకున్న పోలీసులు గది తలుపులు తెరిచి చూడగా.. శేఖర్, పోశమ్మలు అపస్మారక స్థితిలో కనిపించారు. వారిని జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్కు తరలించగా.. పరీక్షించిన వైద్యులు శేఖర్ అప్పటికే చనిపోయినట్లు చెప్పారు. మరికాసేపటికే పోశమ్మ కూడా కన్నుమూసింది. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.