ఏపీలో ఎన్నికల ప్రలోభాలు షురూ .. భీమవరం మండలంలో భారీగా ప్రెషర్ కుక్కర్లు స్వాధీనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు, రాష్ట్ర ఎన్నికల కమీషన్ కు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన పంచాయతీ ఎన్నికలలో ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థులు గెలవడం కోసం ప్రలోభాలకు దిగుతున్నారు. ఒకపక్క ప్రలోభాలకు చెక్ పెట్టడానికి వైసీపీ ప్రభుత్వం జీవో తీసుకురాగా, మరోపక్క రాష్ట్ర ఎన్నికల కమిషన్ సైతం ఎన్నికల ప్రలోభాలపై పటిష్టమైన నిఘా పెట్టింది. అయినప్పటికీ ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థులు గుట్టుచప్పుడు కాకుండా ప్రలోభాల పర్వానికి శ్రీకారం చుట్టారు .
పంచాయతీ వార్ : నామినేషన్ వెయ్యకుండా అన్నంత పని చేసిన పూడూరు గ్రామస్తులు, ఫెయిల్ అయిన అధికారులు
భీమవరం మండలంలో 50 ప్రెషర్ కుక్కర్ లు స్వాధీనం
తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం గూట్లపాడులో ఒక ఇంట్లో దాచిన ప్రెషర్ కుక్కర్ లను పంచాయతీ ఎన్నికల స్పెషల్ స్క్వాడ్ టీం పట్టుకున్నారు. పక్కా సమాచారంతో ఇంట్లో తనిఖీచేసిన స్క్వాడ్ 50 ప్రెషర్ కుక్కర్ లను స్వాధీనం చేసుకున్నారు. 9వ తేదీన జరగబోయే మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు పంచడం కోసం ఈ ప్రెషర్ కుక్కర్ లను తీసుకువచ్చి దాచి పెట్టినట్లుగా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కుక్కర్లు సీజ్ .. కుక్కర్ లు కొనుగోలు చేసిన వారి కోసం ఆరా తీస్తున్న అధికారులు
ఇక స్వాధీనం చేసుకున్న కుక్కర్ లను భీమవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు అధికారులు . ఈ కుక్కర్ లు ఎవరికి సంబంధించినవి అనే విషయంపై ఆరా తీస్తున్నారు. అంతేకాదు ఎన్నికల ప్రలోభాలకు గురి చేసే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెబుతున్నారు.
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రలోభపెట్టే డబ్బు, మద్యం, అలాగే వస్తువులను ఎవరికైనా పంచినట్లు తెలిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఎన్నికల కమీషన్ , అధికారులు హెచ్చరిస్తున్నారు.
అందరికీ ప్రతిష్టాత్మకంగా మారిన పంచాయతీ ఎన్నికలు
ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు పంచాయతీ ఎన్నికలపై తమ ఆధిక్యాన్ని ప్రదర్శించాలని తెగ ప్రయత్నం చేస్తున్నారు. అధికార వైసీపీ ఎక్కువ ఏకగ్రీవాలు చేయాలని ప్రయత్నాలలో ఉంటే, ప్రతిపక్ష టీడీపీ బలవంతపు ఏకగ్రీవాలను అడ్డుకోవాలని తీవ్ర ప్రయత్నాలు సాగిస్తోంది. ఇక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సైతం రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణ సరళిపై దృష్టిసారించి పర్యటన సాగిస్తున్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించాలని ఆయా జిల్లాల అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
మొదటి విడత పోలింగ్ కు ఇంకా రెండు రోజులే .. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులు
రాష్ట్రంలో తొలి దశ ఎన్నికలు నెల 9వ తేదీన జరగనున్న నేపధ్యంలో మరో రెండు రోజులే అవకాశం ఉండటంతో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు . అందులో భాగంగా తాయిలాలు పంచటానికి రెడీ చేసుకుంటున్నారు . పంచాయతీ ఎన్నికలను నిర్వహించే అధికారులు , స్పెషల్ స్క్వాడ్ అధికారులు ఈ ప్రలోభాలపై ప్రత్యేకమైన నిఘా పెట్టారు. ఇదే సమయంలో టీడీపీ నేతల యాక్టివిటీపై వైసీపీ , వైసీపీ నేతలు చేసే పనులపై టీడీపీ నిఘా కొనసాగుతుంది.