పశ్చిమ గోదావరిలో విషాదం: వాగులో ఆరుమంది గల్లంతు: పండుగ సరదా కోసం వెళ్లి..జలసమాధి
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఈత కొట్టడానికి వెళ్లిన ఆరుమంది యువకులు జలసమాధి అయ్యారు. దసరా పండుగ సందర్భంగా కలుసుకున్న ఆరుమంది స్నేహితులు ఈత కొట్టడానికి సమీపంలోని వాగులో దిగారు. బురదలో చిక్కుకుని గల్లంతు అయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలను చేపట్టారు. వాగు నుంచి నాలుగు మృతదేహాలను వెలికితీశారు. మరో రెండు మృతదేహాల కోసం గాలిస్తున్నారు.
శాసన మండలి సభ్యత్వానికి టీడీపీ మహిళా నేత రాజీనామా: ఇదివరకే వైసీపీలో: అనర్హత పిటీషన్
మృతులందరూ 18 ఏళ్ల లోపు వారే కావడంతో గ్రామంలో విషాదం అలముకుంది. వారి కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది. పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలోని భూదేవిపేట సమీపంలోని పెదవాగులో ఈ ఘటన చోటు చేసుకుంది. విజయదశమి ముగిసిన అనంతరం భూదేవిపేట గ్రామస్తులు వనభోజనాల కోసం బుధవారం ఉదయం పెదవాగు ప్రాంతానికి వెళ్లారు. అదే గ్రామానికి చెందిన ఆరుమంది యువకులు సరదాగా ఈత కొట్టడానికి వాగులో దిగారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పెదవాగులో వరదనీరు వచ్చి చేరింది. అనేక చోట్ల గుంతలు ఏర్పడ్డాయి. బురదమట్టి పేరుకుని పోయింది. లోతును వారు సరిగ్గా అంచనా వేయలేకపోయారు. వారు దిగిన ప్రదేశంలో లోతు అధికంగా ఉండటంతో మునిగిపోయారు. బురదలో కూరుకుపోయారు. బయటికి రాలేకపోయారు. ఈ ఘటనలో గంగాధర వెంకట్, శ్రీరాముల శివాజీ, గొట్టుపర్తి మనోజ్, కోనవరపు రాధాకృష్ణ, కర్నాటి రంజిత్ , చల్లా భువన్ గల్లంతు అయ్యారు.
ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాలింపు చర్యలను చేపట్టారు. మధ్యాహ్నం వరకు వెంకట్, శివాజీ, రంజిత్ మృతదేహాలను వెలికి తీశారు. చల్లా భువన్ సహా మరొకరి మృతదేహం కోసం గాలిస్తున్నారు. వారందరూ 18 ఏళ్లలోపు వారే కావడంతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి. తమ పిల్లల మృతదేహాల వద్ద తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు విలపించారు.