రఘురామకృష్ణంరాజు ఇళ్లపై సీబీఐ దాడులు- అలాంటిదేమీ లేదన్న రెబెల్ ఎంపీ
వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీపైనే నిత్యం విమర్శలు గుప్పిస్తున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై సీబీఐ పంజా విసిరింది. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు చెందిన ఇంటితో పాటు మరో ఏడు ప్రాంతాల్లో ఇవాళ సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు ఈ సోదాల్లో పాల్గొంటున్నాయి.
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు చెందిన హైదరాబాద్ నివాసంతో పాటు మరో ఏడు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం ఆరుగంటలకే రఘురామరాజు నివాసం, ఇతర ఆస్తుల వద్దకు చేరుకున్న సీబీఐ బృందాలు సోదాల్లో పాల్గొంటున్నాయి. ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో ఆయన వ్యాపారాలకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నాయి. ఇందు, భారత్ సహా పలు కంపెనీల డైరెక్టర్ల నివాసాల్లోనూ ఈ సోదాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. రఘురామరాజుకు చెందిన తెలుగు రాష్టాల్లోని ఎనిమిది ఆస్తులపై దాడులు కొనసాగుతున్నట్లు సమాచారం.
వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీపైనే ధిక్కార స్వరం వినిపిస్తున్న రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఇప్పటికే వైసీపీ ఎంపీలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కోరారు. దీనిపై ఇంకా చర్యలు తీసుకోలేదు. ఆ లోపే వైసీపీ నేతల నుంచి తనకు హాని ఉందంటూ ఆయన కేంద్రాన్ని ఆశ్రయించి వై కేటగిరీ భద్రత కూడా పొందారు. నిత్యం వైసీపీ ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ వార్తల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో రఘురామరాజు నివాసాలపై సీబీఐ దాడులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సాయంత్రం తర్వాత ఐటీ దాడులపై అధికారులు వివరాలు విడుదల చేసే అవకాశముంది.
Recommended Video
మరోవైపు సీబీఐ దాడుల వార్తలపై రఘురామకృష్ణంరాజు స్పందించారు. తన నివాసాలపై సీబీఐ దాడులు టీవీల్లోనే చూస్తున్నానని, అలాంటిదేమీ లేదని ఆయన వివరణ ఇచ్చారు. హైదరాబాదులో కానీ ఢిల్లీలో కానీ నీ మా ఇంట్లో ఎలాంటి సోదాలు జరగలేదు, అందుకు సంబంధించిన సమాచారం మాకు ఎవరు ఇంతవరకు ఇవ్వలేదని ఆయన వెల్లడించారు.