పోలవరం పనుల్లో స్థంభన..! ప్రభుత్వం ఎప్పుడు చూపుతుందో కరుణ..!!
అమరావతి/హైదరాబాద్ : పోలవరం పనులు స్థంభించాయి. అదికారుల్లో కూడా ఏదో తెలిచని ప్రతిష్టంభన నెలకొంది. కొన్ని రోజుల క్రితం వరకు అక్కడ నిత్యం సందడే సందడి.. రాత్రీ పగలు అన్న తేడా లేకుండా ఒకటే హడావుడి. టిప్పర్ల పరుగులు.. మెషీన్ల రణగొణ ధ్వనులు.. పనిలో నిమగ్నమైన వేలమంది వర్కర్లు.. సూపర్వైజ్ చేసే వందలమంది ఇంజనీర్లు.. అప్పుడప్పుడు ప్రభుత్వ పెద్దల విజిటింగ్లు.. ఉన్నతాధికారుల పర్యవేక్షణలు.. ఇదీ పోలవరం ప్రాజెక్టు దగ్గర మొన్నటివరకూ కనిపించిన దృశ్యం! అయితే ఇప్పుడా సందడే లేదు. మనుషుల అలికిడి మందగించిపోయింది. మెషీన్లు గట్టెక్కాయి. టిప్పర్లు ఒక మూలకు చేరాయి. చాలామంది వర్కర్లు సొంత ఊర్లకు వెళ్లిపోయారు.. ఇదీ ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ వద్ద తాజా పరిస్థితి.
స్థంభించిన పోలవరం పనులు..! కేంద్ర ఆదేశాలే కారణమా..!!
2014లో ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక పోలవరం సీనే మారిపోయింది. కేవలం మూడేళ్ల వ్యవధిలోనే దాదాపు అన్ని పనులు ఒక కొలిక్కి వచ్చేశాయి. డయాఫ్రం వాల్ పనులు నూరు శాతం, కాపర్ డ్యాం పనులు 80 శాతం, స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనులు 70 శాతం పూర్తయ్యాయి. మరో ఏడాదిలో గ్రావిటీ ద్వారా నీరు అందించాలని టీడీపీ సర్కారు లక్ష్యంగా పెట్టుకోగా ఇటీవల జరిగిన ఎన్నికలు ఆ ఆశలపై నీళ్లు జల్లాయి. ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ ప్రభావం ప్రాజెక్టు పనులపై పడింది. నాటి టీడీపీ ప్రభుత్వం పట్టుదల కారణంగా పోలవరం పనుల్లో కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకోలేకపోయింది. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి రావడంతో ఒక్కసారిగా కేంద్రం ఆంక్షలు విధించడం మొదలుపెట్టింది.
మందగించిన వేగం..! మూలన పడ్డ యంత్రాలు..!!
మరోపక్క వర్షాకాలం రావడంతో స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనుల్లోనూ వేగం మందగించింది. ఒక్క మాటలో చెప్పాలంటే దాదాపుగా ఈ పనులు నిలిచిపోయాయి. ఫలితంగా పోలవరం ప్రాజెక్టు వద్ద ఇప్పుడు పూర్తిగా సందడి తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం తీరుపై అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే కాపర్ డ్యాం పనులు నిలిచిపోకుండా ప్రభుత్వం గట్టిగా పట్టుబడితే, ఆ పనులు సాగడానికి అవకాశం ఉండేదట. కానీ వైసీపీ సర్కార్ కేంద్రం ఆదేశాల అమలుకే మొగ్గుచూపిందట. కాపర్ డ్యాంల వలన ఎగువ గ్రామాలు ముంపునకు గురవుతాయన్న మాటలో వాస్తవం ఉండొచ్చు- కానీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని సత్వరమే అమలుచేయడం ద్వారా ఆ సమస్యని అధిగమించవచ్చు. అయితే జగన్ సర్కార్ ఆ దిశగా చర్యలు తీసుకోలేదనే చర్చ కూడా జరుగుతోంది.
2021 నాటికి పూర్తి చేస్తామన్న సీఎం..! పనులు మాత్రం నత్త నడక..!!
కాపర్ డ్యాంలు కడితే ఎగువన ఉన్న గ్రామాలు ముంపునకు గురవతాయని ఇంజనీర్లకు తెలియంది. అదే సమయంలో పరిష్కార మార్గం కూడా వారికి తెలుసు. కానీ ప్రభుత్వ పెద్దల మాటకు ఎదురుచెప్పలేక వారు కామ్గా ఉండిపోయారన్న వాదనలున్నాయి. ఇక స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనుల విషయానికొస్తే.. గతంలో భారీ వర్షాలు పడినప్పుడు మాత్రమే ఆ పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. మిగిలిన అన్ని రోజుల్లో ఆ పనులు నిరాటంకంగా సాగాయని చెప్తున్నారు కొందరు ఇంజనీర్లు. గోదావరికి వరదలు వస్తే అడ్డుకట్టలు వేసి మరీ పనులు చేసిన సందర్భాలు ఉన్నాయని వారు గుర్తుచేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు ప్రాజెక్టు ప్రాంతంలో స్వల్ప స్థాయిలో మాత్రమే పనులు కొనసాగటం పట్ల పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ప్రాజెక్టు ఆలస్యానికి రాజకీయాలే కారణమా..! ఏపి సీఎం ఏం చేయబోతున్నారు..?
ఇదంతా ఒక ఎత్తయితే.. వైసీపీ నేతలు మాత్రం మరోలా మాట్లాడుతున్నారని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. పోలవరం ప్రాజెక్టును ప్రారంభించింది వైఎస్ రాజశేఖర్రెడ్డి అనీ, దానిని పూర్తిచేసేది ఆయన తనయుడు జగన్ అనీ ఆ పార్టీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ ప్రచారాన్ని చూసి స్థానిక పెద్దలు ముసిముసిగా నవ్వుకుంటున్నారట. పోలవరం పనులు ఇదే తీరుగా సాగితే ఉన్నేళ్లు గడిచినా అది పూర్తి కాదని సాంకేతిక నిపుణులు సైతం చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల పోలవరం ప్రాంతాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి జగన్.. ఈ ప్రాజెక్టను 2021 జూన్ నాటికి పూర్తిచేస్తామని ప్రకటించారు. ఆయన అనుకున్నట్లుగా ప్రాజెక్టు పూర్తయితే ప్రజల మదిలో జగన్ చిరస్మరణీయుడిగా ఉండిపోతారనడంలో సందేహం లేదు.. కానీ ఆయన మాట నెరవేరాలంటే ప్రాజెక్టు పనుల్లో మరింత వేగం తేవాల్సిన అవరసముందని నిపుణులు చెప్తున్నారు. మరి వైసీపీ ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి..!