లోకేష్పై కేసు నమోదు- నిర్లక్ష్యంగా ట్రాక్టర్ నడిపి -జనం ప్రాణాలు రిస్క్లో పెట్టినందుకు
టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ ఎక్కడ దొరికితే అక్కడ కేసులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్న వైసీపీ సర్కారు తాజాగా మరో కేసు నమోదు చేసింది. ఈసారి లోకేష్పై పలు సెక్షన్ల కింద పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా జిల్లాలో టీడీపీ శ్రేణులతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన నిర్వహించిన పర్యటనే ఇందుకు కారణమయింది.
పశ్చిమగోదావరి జిల్లాలోని ఆకివీడు మండలం సిద్ధాపురం వద్ద నిన్న టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ఇతర టీడీపీ నేతలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ట్రాక్టర్లో పలువురు టీడీపీ కార్యకర్తలను ఎక్కించుకుని హుషారుగా టూర్ చేస్తున్నారు. మధ్యలో బురదలో ట్రాక్టర్ ఇరుక్కుపోవడంతో జనం భయభ్రాంతులకు గురయ్యారు. అక్కడే ఉన్న ఉండి టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు వెంటనే జోక్యం చేసుకుని ట్రాక్టర్ను అదుపు చేశారు. వెంటనే లోకేష్ను కిందికి దింపి అక్కడికి నుంచి తీసుకెళ్లారు. లోకేష్కు పెను ప్రమాదం తప్పడంతో టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.
Recommended Video
ఈ ఘటనపై స్పందించిన ఆకివీడు పోలీసులు నారా లోకేష్పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇందులో నిర్లక్ష్యంగా ట్రాక్టర్ నడిపి జనం ప్రాణాలు రిస్క్లో పెట్టారంటూ ఓ కేసు, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి ఎక్కువ మందితో టూర్ చేసినందుకు మరో కేసు నమోదైనట్లు తెలుస్తోంది. డ్రైవింగ్పై అవగాహన లేకుండా ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తూ కొందరిని ట్రాక్టర్ ఎక్కించుకుని నిర్లక్ష్యంగా వారి ప్రాణాలకు హాని కలిగించేలా అక్కడున్న రోడ్లపై అవగాహన లేకుండా ట్రాక్టర్ డ్రైవింగ్ చేసినందుకు గానూ కేసు నమోదు చేస్తున్నట్లు ఆకివీడు పోలీసులు తెలిపారు.