రాజీనామాకు నేనూ సిద్ధం: వైసీపీకి రఘురామ సవాల్, జగన్ ఢిల్లీ టూర్, ఎన్డీఏలో చేరికపైనా..
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోసారి సొంత పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా కోసం 21 మంది వైయస్సార్సీపీ ఎంపీలు రాజీనామా చేస్తే.. అందుకు తాను కూడా సిద్ధమేనని సవాల్ విసిరారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. వైయస్సార్సీపీ హోదా కోసం చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు సిద్ధపడితే తాను కూడా సహకరిస్తానని రఘురామ తెలిపారు.
తిరుమల డిక్లరేషన్: సీఎం జగన్ ఆ పని చేస్తే సరిపోతుంది కదా?: రఘురామ కృష్ణరాజు

వైసీపీవీ ఉత్తుత్తి కబుర్లే..
ఇక ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపైనా ఆయన స్పందించారు. కేంద్రమంత్రి వర్గంలో వైసీపీ చేరుతుందంటూ ఆ పార్టీనే కొన్ని పత్రికల్లో రాయించుకుందని ఆరోపించారు. తాము కేంద్ర మంత్రులం అయిపోయామని వైసీపీ నేతలు ఉత్తుత్తి కబుర్లు చెబుతున్నారని, నవంబర్ నెలలో కేంద్రమంత్రి వర్గ విస్తరణ వరకు వీళ్లు ఇలాగే చెప్పుకుంటారని ఎద్దేవా చేశారు. వీళ్లు చెప్పేవి అన్నీ అబద్ధాలేనని వచ్చే నెలలో తేలిపోతుందని అన్నారు.

ఆ అవసరం బీజేపీకి లేదు..
అసలు బీజేపీతో వైసీపీకి మైత్రి ఎలా సాధ్యపడుతుందని రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. వైసీపీని ఎన్డీయేలో చేర్చుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదని అన్నారు. ఎవరితోనూ కలిసేది లేదని బీజేపీ చెబుతుండగా.. వైసీపీ మాత్రం సొంత ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు.

రాజీనామాకు నేనూ సిద్ధమే..
హోదాపై చిత్తశుద్ధి ఉంటే కేంద్ర కేబినెట్ నుంచి బయటికి రావాలని అప్పట్లో టీడీపీని డిమాండ్ చేసింది ఎవరు? అంటూ రఘురామ నిలదీశారు. హోదాపై తమ చిత్తశుద్ధిని నిరూపించుకుంటూ.. రాజీనామా చేయాలని విప్ జారీ చేస్తే అందరితోపాటు తాను కూడా ఉంటానని చెప్పారు. అమరావతి విషయంలో రైతులకు న్యాయం జరగబోతోందని రఘురామ వ్యాఖ్యానించారు. రైతులు, మహిళలు గాంధేయ మార్గంలో ఆందోళన కొనసాగించాలని ఎంపీ కోరారు.

కట్టు కథలు ప్రచారం చేస్తూ..
దేవాలయాలు నిర్మించే పార్టీ అయిన బీజేపీ.. ఆలయాలు కూల్చే వైసీపీతో కలుస్తుందా? అని ప్రశ్నించారు. ఆలయాలపై దాడులు చేసే వ్యక్తులపై చర్యలు తీసుకోలేని జగన్.. ఇప్పుడు బీజేపీతో కలవాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.
అయినా, వీళ్లను ఎన్డీయేలోకి రావాలని బతిమాలుకుంటున్నట్లు, వీరు ప్రత్యేక హోదా కోసం పట్టబడుతున్నట్లు కట్టుకథలు ప్రచారం చేస్తున్నారని రఘురామ ఆరోపించారు.