రఘురామకు ఎస్సెమ్మెస్- ఫోన్ చేసి రావొద్దన్న వైసీపీ- బహిష్కరణే అంటున్న రెబెల్ ఎంపీ...
వైసీపీ తరఫున గెలిచి కొంతకాలంగా ఆ పార్టీపై నిత్యం విమర్శలకు దిగుతున్న రఘురామరాజుకు ఇవాళ ఆ పార్టీ నేతలు కావాలనే చుక్కలు చూపించినట్లు తెలుస్తోంది. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేసేందుకు అధినేత జగన్ ఏర్పాటు చేసిన ఎంపీల సమావేశానికి మిగతా ఎంపీలతో పాటు ఆహ్వానం పంపిన వైసీపీ.. ఆ తర్వాత ఫోన్ చేసి రావొద్దని కోరడం సంచలనం రేపుతోంది. దీంతో మనస్తాపానికి గురైన రఘురామ ఆ తర్వాత పార్టీ తీరుపై నిప్పులు చెరిగారు. ఏదేమైనా తన విషయంలో పార్టీ క్లారిటీ ఇవ్వడం సంతోషంగానే ఉందన్నారు...
జగన్ కు కేంద్రం షాక్- రెబెల్ ఎంపీ రఘురామకు వై కేటగిరీ భద్రత- సంచలన నిర్ణయం..
రఘురామను ఆడుకున్న వైసీపీ...
ఏడాది క్రితం తమ పార్టీ గుర్తుపై గెలిచి నిత్యం సొంత ప్రభుత్వం, పార్టీపై విమర్శలకు దిగుతున్న రఘురామరాజుతో ఆడుకునేందుకు ఇవాళ వైసీపీ నేతలకు ఓ అవకాశం దొరికింది. పార్లమెంటు సమావేశాలకు ముందు ఎంపీలతో నిర్వహించే భేటీ ఇందుకు వేదికైంది. రాష్ట్ర సమస్యలపై అన్ని పార్టీల ఎంపీలతో సీఎం జగన్ భేటీ నిర్వహించాలని రఘురామరాజు గత వారం కోరారు. ఇది ఆనవాయితీ కూడా అని సుద్దులు చెప్పారు. తీరా చివరి నిమిషం వరకూ ఈ భేటీపై స్పష్టత ఇవ్వని జగన్... ఇవాళ పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అవుతుండగా ఉదయం వర్చువల్ భేటీకి పిలుపునిచ్చారు. ఇందులో పాల్గొనాలని పార్టీ తరఫున ఎంపీలకు సమాచారం ఇచ్చారు.
ఎస్మెమ్మెస్తో పిలిచాక.... రావొద్దంటూ ఫోన్ కాల్
ఇవాళ ఉదయం 9 గంటలకు సీఎం జగన్ వైసీపీ ఎంపీలతో ఏర్పాటు చేసిన పార్లమెంటు సమావేశాల వ్యూహాత్మక భేటీకి రావాలని అందరు ఎంపీలకు పంపినట్లే రఘురామరాజుకు కూడా ఆహ్వానం పంపారు. ఎంపీల ఫోన్లకు పార్టీ తరఫున మెసేజ్లు పంపారు. వీటిని చూసిన ఎంపీలు జగన్తో వర్చువల్ భేటీకి సిద్దమవుతున్న తరుణంలో రఘురామరాజుకు 11 గంటల 11 నిమిషాలకు ఢిల్లీలోని ఏపీ భవన్ ఉద్యోగి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. జగన్తో భేటీకి హాజరుకావొద్దంటూ ఆయన సూచించారు. దీంతో రఘురామరాజు షాకయ్యారు. అదే విషయాన్ని లిఖిత పూర్వకంగా ఇవ్వాలని కోరారు. అయితే అటు నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో రఘురామ ఆగ్రహానికి గురయ్యారు. మిగిలిన ఎంపీలు మాత్రం యథావిథిగా వర్చువల్ భేటీకి హాజరైన తర్వాత పార్లమెంటుకు వెళ్లిపోయారు.
బహిష్కరణే అంటున్న రఘురామ...
వైసీపీ ఎంపీల భేటీకి తనను మెసేజ్ ద్వారా ఆహ్వానించి కాల్ చేసి రావొద్దని కోరడంపై రఘురామ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని బట్టి తనను పార్టీ నుంచి బహిష్కరించినట్లే భావిస్తున్నట్లు ఢిల్లీలో మీడియాకు చెప్పారు. పార్టీ ఎంపీల భేటీకి హాజరు కావాలని విప్ ఇస్తే పాటించాల్సిన బాధ్యత తనపై ఉంటుందని, కానీ పార్టీకి మీకు సంబంధం లేదని చెప్పారని రఘురామ వెల్లడించారు. దీనిపై న్యాయనిపుణులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని రఘురామ వెల్లడించారు. ప్రస్తుతం తాను ఏ పార్టీలో ఉన్నానో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. దీనిపై మరింతగా ప్రశ్నించిన మీడియాతో మీలోనూ విద్యావంతులు ఉన్నారుగా..... దీనిని ఏ విధంగా భావించాలో ఆ విధంగానే రాసుకోండి అని చెప్పారు.
Recommended Video
రఘురామకు అవకాశం దొరికిందా ?
ఇన్నాళ్లూ తనను వైసీపీ సస్పెండ్ చేస్తుందని రఘురామరాజు.. కాదు ఆయనే వెళ్లిపోతారని వైసీపీ ఎవరికి వారు భావిస్తూ వచ్చారు. తాము సస్పెండ్ చేస్తే రఘురామ సునాయాసంగా బీజేపీ పంచన చేరిపోతారని వైసీపీ భావిస్తుంటే.. తాను బీజేపీలో చేరితే వేటు పడుతుందని రఘురామ భావించారు. కానీ ఇప్పుడు పార్టీ ఎంపీల భేటీకి రావొద్దని, తనకు పార్టీతో సంబంధం లేదని చెప్పడంతో దీన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నుంచి బయటపడేందుకు రఘురామ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. న్యాయనిపుణులతో సంప్రదిస్తానంటూ రఘురామ చేసిన వ్యాఖ్యల వెనుక ఉద్దేశమిదే అని తెలుస్తోంది.