West Godavari: మంటల్లో స్కూల్ బస్సు.. ఆ సమయంలో 25 మంది విద్యార్థులు.. !
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో శుక్రవారం ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. ప్రైవేటు పాఠశాల బస్సు మంటల్లో చిక్కుకుంది. పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో విద్యార్థులెవరికీ ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. దీనితో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మంటలు చెలరేగడాన్ని సకాలంలో గుర్తించడంతో పెను ప్రమాదం తప్పినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళ సిబ్బంది సంఘటనా స్థలం వద్దకు చేరుకుని మంటలను నియంత్రించారు. పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు మండలం మీనా నగరం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని దేవరపల్లి మండలం గౌరీపట్నంలోని నిర్మలగిరి పాఠశాలకు చెందిన బస్సు అది.
సుమారు 25 మంది విద్యార్థులతో గౌరీపట్నం నుంచి చాగల్లుకు బయలుదేరింది. విద్యార్థులను తరలిస్తున్న క్రమంలో బస్సు ఇంజిన్ నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. నల్లటి పొగలు వెలువడిన వెంటనే మంటలు అగ్నికీలలు చెలరేగాయి. ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టాడు స్కూల్ బస్సు డ్రైవర్. వెంటనే బస్సును రోడ్డు పక్కన నిలిపి వేశాడు. విద్యార్థులను కిందకు దించాడు.
నల్లటి పొగలు వెలువడటాన్ని చూసిన విద్యార్థులు అత్యవసర ద్వారం గుండా బయట పడ్డారు. దూరంగా పారిపోయారు. దీనితో ఘోర ప్రమాదం తప్పింది. ప్రమాదం నుంచి విద్యార్థులు సురక్షితంగా బయటపడగా...బస్సు పూర్తిగా దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఘటన జరిగిందని భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది.