నిన్న జాతీయజెండా..! నేడు వినాయకుడి విగ్రహం తొలగించి వైఎస్ విగ్రహమా?
అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వర్గాల అత్యుత్సాహం విమర్శలకు తావిస్తోంది. అయినా ఏమాత్రం వెనక్కి తగ్డడం లేదు. గ్రామ సచివాలయాలకు వైఎస్సార్సీపీ పార్టీ రంగులు వేస్తున్న విషయం తెలిసిందే. టీడీపీ ఉన్నప్పుడు పసుపు రంగు వేశారని.. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగులు ప్రభుత్వ కార్యాలయాలపై పడుతుండటం శోచనీయం. వైసీపీ సర్కారు తీరుపై టీడీపీతోపాటు విపక్ష పార్టీలు విమర్శలు ఎక్కుపెట్టారు.
వైసీపీ భవనాలకు పార్టీ రంగులు వేసుకోటానికే ... పాలించటానికి పనికిరాదన్న కన్నా
మొన్న జాతీయ జెండా రంగును తొలగించి..
అనంతపురం జిల్లాలో గ్రామ సచివాలయంపై ఉన్న జాతీయ జెండా రంగుల్ని మార్చి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేయడంపై సర్వత్రా విమర్శలకు తావిచ్చిన విషయం తెలిసిందే. రెండ్రోజులుగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా కొనసాగుతోంది. దీనిపై టీడీపీతపాటు అన్ని పార్టీలు, ప్రజలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. జాతీయ జెండా కన్నా వైసీపీ జెండా ఎక్కువైందా? అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ప్రశ్నించారు.
దేవుడిని కూడా వదలరా?
ఈ వివాదం కొనసాగుతుండగానే వైసీపీ నేతలు మరో వివాదానికి తెరలేపారు. పశ్చిమగోదావరి జిల్లా పట్టిన్నపాలెం అనే గ్రామంలో వినాయకుడి విగ్రహాన్ని తొలగించి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం పెట్టేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారు. దీంతో స్థానికులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు రంగంలోకి దిగి వైసీపీ తీరుపై మండిపడుతున్నారు.
దేశం కన్నా.. దేవుళ్ల కన్నా..
ఓ న్యూస్ ఛానల్ ప్రసారం చేసిన కథనాన్ని కూడా టీడీపీ ట్వీట్ చేసింది. ‘నిన్న జాతీయ జెండా రంగులకు వైసీపీ రంగులు పూసి తమకు దేశం కన్నా మా పార్టీనే ముఖ్యమని చాటుకున్నారు వైసీపీ నేతలు. ఇక ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా పట్టిన్నపాలెంలో ఏకంగా వినాయక విగ్రహాన్నే తొలగించి వైస్సార్ విగ్రహాన్ని పెట్టేందుకు ప్రయత్నించారు వైసీపీ నేతలు' అంటూ టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇంకేమేం చేస్తారో..
‘దీన్ని స్థానికులు వ్యతిరేకించగా అదిప్పుడు వివాదమైకూర్చుంది. ఇప్పటికే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో రాష్ట్రగీతమైన తెలుగుతల్లి గీతాన్ని ఆలపించడం ఆపేసారు. ఇకపై గాంధీ, అంబేద్కర్ విగ్రహాలను కూడా తీసేసి వైఎస్ఆర్ విగ్రహాలో, రాజారెడ్డి విగ్రహాలు పెడతారేమో అని జనం బెంబేలెత్తిపోతున్నారు' అంటూ వైసీపీ సర్కారు తీరుపై టీడీపీ సెటైర్లు వేసింది.
మనోభావాలు దెబ్బతీస్తారా?
వినాయకుడి విగ్రహాన్ని తొలగించి వైఎస్సార్ విగ్రహం పెట్టాలనుకోవడం సరికాదని స్థానికులు అంటున్నారు. రంగంలోకి దిగిన బీజేపీ నేతలు వైసీపీ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవుడి కంటే వైఎస్ ఎక్కువ కాదని, హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.