టీడీపీనే నమ్మక ద్రోహం చేసింది .. పార్టీ ఓటమికి కారణం ఆయనే..బీజేపీకి జై అన్న అంబికా కృష్ణ
ఏపీ ఎన్నికల్లో పరాజయం పాలైన టీడీపీ ఇప్పుడు వలసలతో ఇబ్బంది పడుతుంది . ఒక పక్క ఏపీ సీఎం జగన్ ఎవరైనా పార్టీ మారాలనుకుంటే పదవులకు రాజీనామా చేసిన రావాలని చెప్పటంతో జగన్ పార్టీ వైపు చూసిన నేతలు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైపు చూస్తున్నారు. ఇక అందులో భాగంగా టీడీపీ రాజ్య సభ సభ్యులు నలుగురు బీజేపీలో చేరి అదే విధంగా టీడీపీ రాజ్యసభాపక్షాన్ని బీజేపీలో విలీనం చేశారు. ఇంకా ఏపీలో ఎమ్మెల్యేలలో మరికొంత మంది సైతం బీజేపీలో చేరే ఆలోచనలో ఉన్నారు. ఈ నేపధ్యంలోనే చంద్రబాబుకు షాకిస్తూ ఎప్పటి నుండో టీడీపీలో ఉన్న అంబికా కృష్ణ బీజేపీలో చేరారు.
చంద్రబాబుకుషాక్ ఇచ్చిన అంబిక కృష్ణ ... బీజేపీలో చేరిక
ఏపీలో బీజేపీ 'ఆపరేషన్ ఆకర్ష్' కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో రాం మాధవ్ రంగంలోకి దిగాక బీజేపీ గణనీయంగా పుంజుకుంటుంది . ఇక టీడీపీ నుంచి ఇటీవలే నలుగురు రాజ్యసభ సభ్యులు కాషాయ కండువాలు కప్పుకున్న నేపథ్యంలో, తెలుగుదేశం పార్టీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఏలూరు టీడీపీ నేత, సినీ ప్రముఖుడు అంబికా కృష్ణ బీజేపీలో చేరారు.న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్ సమక్షంలో అంబికాకృష్ణ కాషాయ కండువా కప్పుకున్నారు. బాబుకు షాక్ ఇచ్చారు. ఇప్పుడు టీడీపీలో సంక్షోభం పీక్స్ కి చేరింది.
టీడీపీకి షాకిచ్చిన వంగవీటి రాధా .. జనసేనానితో భేటీ .. జనసేనకు జంప్
తాను టీడీపీకి ద్రోహం చెయ్యలేదు.. పార్టీనే తనకు ద్రోహం చేసింది అన్న అంబికా కృష్ణ
ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న టీడీపీని పూర్తిగా నిర్వీర్యం చేసే దిశగా బీజేపీ పావులు కదుపుతోంది. ఏపీలోని కీలక టీడీపీ నేతలతో బీజేపీ నేతలు టచ్ లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. వారందరినీ బీజేపీలోకి చేర్చుకోవడం ద్వారా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకోవాలనే వ్యూహాన్ని బీజేపీ అమలు చేస్తోంది. అంతే కాదు ఊహించని విధంగా సీనియర్ నేతల వలసలతో టీడీపీలో ఆందోళన నెలకొంది. కేసులు, దాడుల భయంతోనే కొందరు నేతలు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారని, కార్యకర్తలు మనోధైర్యం కోల్పోవద్దని టీడీపీలోని సీనియర్లు పేర్కొంటున్నారు . ఇక బీజేపీలో చేరిన అంబికా కృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ, తానేమీ టీడీపీకి ద్రోహం చేయలేదని అన్నారు. టీడీపీనే తనకు ద్రోహం చేసిందని ఆయన పేర్కొన్నారు.
ఎన్నికల్లో ఓటమికి చంద్రబాబే కారణం .. బీజేపీతో గొడవ పర్యవసానమే తాజా పరిస్థితి
తాను ఎంతో కష్టపడి పనిచేస్తే టీడీపీనే తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని మండిపడ్డారు . ఎన్నికల్లో టీడీపీ ఓటమికి చంద్రబాబే కారణమని ఆరోపించారు. బీజేపీతో గొడవ అవసరం లేదని ఎంత చెప్పినా బాబు వినలేదని , ఓ దశలో చంద్రబాబు బీజేపీ మీద చేసిన పోరాటాలు తనకు నచ్చలేదని అంబికా కృష్ణ చెప్పారు. బీజేపీతో విభేదాలు వద్దని చెప్పినా చంద్రబాబు వినిపించుకోలేదని ఇక దాని పర్యవసానమే తాజా పరిస్థితి అని ఆయన పేర్కొన్నారు . ప్రధాని మోడీ నాయకత్వ లక్షణాలు నచ్చడంతో బీజేపీలో చేరానని, త్వరలోనే మరికొందరు నేతలు బీజేపీలో చేరుతున్నారని చెప్పి అంబికా కృష్ణ బాంబు పేల్చారు . దీంతో ఇప్పుడు టీడీపీలో ప్రకంపనలు ఎక్కువయ్యాయి.