భీమవరంలో ఉద్రిక్తత: అంబేద్కర్ విగ్రహానికి చెప్పులదండ: పాలాభిషేకం చేసిన వైసీపీ ఎమ్మెల్యే
ఏలూరు: తూర్పు గోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పులదండ వేయడం దీనికి కారణమైంది. అంబేద్కర్ విగ్రహం పాక్షికంగా ధ్వంసమైనట్లు గుర్తించారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ ఘటనకు కారణం.. జనసేన పార్టీ కార్యకర్తలేననే అనుమానాలను ఎమ్మెల్యే వ్యక్తం చేశారు. వారిని అసాంఘిక శక్తులుగా పేర్కొన్నారు.
భీమవరం నియోజకవర్గం పరిధిలోని వీరవాసరం మండలం మత్స్యపురిలో గురువారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ గ్రామం పరిధిలోకి వచ్చే పంచాయతీకి నిర్వహించిన ఎన్నికల్లో జనసేన పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్యకర్తలు మత్స్యపురిలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారని, ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి చెప్పులదండ వేశారని వైసీపీ నాయకులు ఆరోపిస్తోన్నారు.
ఈ సమాచారం అందిన వెంటనే గ్రంధి శ్రీనివాస్ మత్స్యపురి గ్రామానికి బయలుదేరి వెళ్లారు. అంబేద్కర్ విగ్రహానికి వేసిన చెప్పుల దండను తొలగించారు. అప్పటికప్పుడు విగ్రహాన్ని పాలతో అభిషేకించారు. ఎమ్మెల్యే వెంట ఆయన అనుచరులు, వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రంధి శ్రీనివాస్ను కలుసుకున్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించిన వారిని సాయంత్రంలోగా అరెస్ట్ చేయాలంటూ ఆయన ఆదేశించారు. దుండగులను అరెస్ట్ చేయడంలో పోలీసులు అరెస్టయితే.. దళిత సంఘాలతో కలిసి ధర్నాలు చేస్తామని హెచ్చరించారు.
ఈ దారుణానికి పాల్పడింది జనసేన కార్యకర్తలేనని గ్రంధి శ్రీనివాస్ ఆరోపించారు. మత్స్యపురి గ్రామంలో జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున అరాచకాలకు పాల్పడుతోన్నారని విమర్శించారు. సంఘ విద్రోహశక్తులుగా తయారయ్యారని మండిపడ్డారు. దీనికి పూర్తిగా పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వహించాల్సి ఉంటుందని డిమాండ్ చేశారు. పవన్ కల్యాణ్ ఎప్పుడూ.. తలలు తీసేస్తామంటూ మాట్లాడుతుంటారని, ఆయన పార్టీ కార్యకర్తలు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజకీయ పార్టీ పెట్టి.. సమాజంలో సంఘ విద్రోహ శక్తులను పెంచి పోషిస్తోన్నారని ఆరోపించారు.