2020లో పశ్చిమగోదావరి జిల్లా: కరోనా, కొండచిలువకు సర్జరీ..ఏలూరు వింత వ్యాధిలే హాట్ టాపిక్..!
పశ్చిమగోదావరి: 2020 వ సంవత్సరం పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు చాలా స్మృతులనే మిగిల్చింది. వింత వ్యాధి, కొండ చిలువకు శస్త్ర చికిత్స, వరదలకు కొట్టుకుపోయిన రోడ్లు, గ్యాస్ లీక్ ఘటనలు, కరోనా వైరస్, ఇలా అనేక అంశాలు ప్రధానంగా నిలిచాయి. అయితే, ప్రజల్లో చర్చకు దారి తీసిన పలు ముఖ్యాంశాల గురించి తెలుసుకుందాం.
Recommended Video
నవంబర్ 20న జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో 12 అడుగుల కొండ చిలువకు శస్త్ర చికిత్స జరిగింది. జీలుగుమిల్లి మండలం తూము చెరువులో చేపల వలలో చిక్కుకున్న కొండ చిలువను, స్నేక్ సొసైటీ సభ్యుడు క్రాంతి బయటకు తీశాడు. తీవ్ర గాయాలతో ఉన్న దాన్ని అటవీ కార్యాలయ సిబ్బందికి అప్పగించగా, వారు శస్త్ర చికిత్స చేశారు. అనంతరం ఆ కొండ చిలువను అడవిలో వదిలేశారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా అక్టోబర్ రెండో వారంలో జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. ఏజెన్సీలోని కొండ వాగులు, కాల్వలు పొంగి కాజ్వేలను ముంచెత్తాయి. ఇప్పులపాడు వద్ద రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. గిరిజన గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆగస్టు 19న జిల్లాలో జరిగిన విషాద సంఘటన అందర్నీ కలచివేసింది. కొవ్వూరు మండలం పసివేదలకు చెందిన నరసయ్య అనే వ్యక్తి ఆగస్టు 16న కరోనాతో మృతి చెందాడు. కుటుంబ పెద్ద మరణించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన భార్యా పిల్లలు.. తమను పలువురు అంటరానివారిగా చూస్తున్నారన్న భావనతో నరసయ్య భార్య సునీత, కుమారుడు ఫణికుమార్, కుమార్తె అపర్ణ గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
మే 29న జిల్లాలోని కోనపోతుగుంట గ్రామంలో చేతి పంపు నుంచి గ్యాస్ లీక్ అయింది. బండి ఏసు అనే వ్యక్తికి చెందిన పెరట్లో చేతి పంపును బిగించగా, అందులో నుంచి మంటలు వచ్చాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఇక, జిల్లా ప్రజలను కరోనా వైరస్ తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. ఆర్థిక కష్టాల్లోకి నెట్టింది. 93 వేల 400లకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన జిల్లాలో పశ్చిమ గోదావరి రెండో స్థానంలో నిలిచింది. అలాగే, వైరస్ బారినపడి 530 మందికిపైగా మృతి చెందారు.
డిసెంబర్ 5న జిల్లాలోని ఏలూరులో వింత వ్యాధి వెలుగు చూసింది. చూస్తుండగానే ప్రజలు కళ్లుతిరిగి పడిపోయారు. మొత్తంగా 615 కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధికి గురైన వారిలో ముగ్గురు చనిపోగా, ఇద్దరు ఇతర అనారోగ్యాలతో చనిపోయినట్టు వైద్యులు పేర్కొన్నారు. అధికారుల చర్యలతో పరిస్థితులు అదుపులోకి వచ్చినా, వింత వ్యాధికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.