ఏపీ సీఎం వైఎస్ జగన్ కు గుడి కడుతున్న వైసీపీ నాయకులు... ఎక్కడంటే !!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి గుడి కట్టాలని నిర్ణయం తీసుకున్నారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వైసిపి నాయకులు. వైయస్ జగన్మోహన్ రెడ్డిని దేవుడిగా భావిస్తూ గుడి కట్టాలని భావించిన వైసిపి నాయకులు గుడి నిర్మాణం కోసం శంకుస్థాపన చేసినట్లుగా సమాచారం. ఏపీ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలులోకి తీసుకు వచ్చిన జగన్ తమకు దేవుడని, అందుకే ఆయనకు గుడి కట్టాలని నిర్ణయం తీసుకున్నామని వైసీపీ నేతలు చెప్తున్నట్లుగా తెలుస్తోంది.
ఏపీలోనూ తమిళనాడు కల్చర్ ... జగన్ కు గుడి
తమిళనాడు వంటి రాష్ట్రాలలో రాజకీయ నాయకులకు గుడికట్టిన సందర్భాలను అనేకం చూశాం. తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన జయలలితకు గుళ్ళు కట్టి పూజలు చేసిన అభిమానులున్నారు. ఇక ఇదే తరహాలో తమిళనాడు సంస్కృతి ఏపీకి పాకినట్టు కనిపిస్తుంది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కి గుడి కట్టాలని నిర్ణయం తీసుకున్నారు ఏపీలో వైసీపీ నేతలు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం రాజుపాలెం లో ఈ గుడి నిర్మాణం చేయనున్నట్లుగా తెలుస్తోంది.
సీఎం జగన్ గుడి నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
నిరు పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి తమకు దేవుడని పేదల ఇళ్ల స్థలాలను ఇవ్వడానికి కేటాయించిన భూమికి దగ్గరగా సీఎం జగన్ గుడి నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు వైసిపి నాయకులు. సీఎం జగన్ గుడి నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు కూడా పాల్గొన్నట్లుగా సమాచారం. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని దైవాంశ సంభూతుడిగా భావిస్తూ గుడి కట్టాలని భావిస్తున్న వైసిపి నేతల తీరు చూసి ప్రతిపక్ష పార్టీల నేతలు ముక్కున వేలేసుకుంటున్నారు.
ప్రజా సంక్షేమం కోసం పని చేసే జగన్ పై అభిమానం వ్యక్తం చేసేందుకే గుడి
సీఎం జగన్ మోహన్ రెడ్డి దేశంలో ఏ సీఎం చేయని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, ప్రజా సంక్షేమం కోసం పాటు పడుతున్నారని వైసీపీ నేతలు చెప్పుకోవడం విశేషం. మొత్తానికి తొలిసారి సీఎంగా ఏపీలో పాలన సాగిస్తున్న జగన్ మోహన్ రెడ్డిపై అభిమానం వ్యక్తం చేసుకోవటానికి ఏకంగా ఆయన కోసం గుడినే కట్టాలని భావిస్తున్నారు వైసీపీ నాయకులు . ఏళ్ళ తరబడి పాలన సాగించిన చంద్రబాబు వంటి నేతల విషయంలో ఎవరూ ఈ తరహా నిర్ణయం తీసుకోకపోవటం గమనార్హం .