రఘురామ రాజు విందు రాజకీయం: కేవీపీతో వద్దు...150 మంది ఎంపీలతో: జగన్ వద్ద సత్తా చాటేందుకేనా..!
వైసీపీ నుండి నర్సాపురం ఎంపీగా గెలిచిన రఘురామరాజు మరోసారి హాట్ టాపిక్ గా మారారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభం రోజునే తెలుగు భాష మీద చేసిన వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి ఆగ్రహానికి గురయ్యారు. దీని పైన ఆయన స్వయంగా వివరణ ఇచ్చారు. ఇక, పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో నేరుగా ఆ ఎంపీని ప్రధాని పేరు పెట్టి పిలిచి మరీ..పలకరించటంతో ఆయన ఇప్పుడు పాపులర్ ఎంపీ అయిపోయారు. వైసీపీ నేతలు సైతం ఆయన గురించి ఆచితూచి స్పందిస్తున్నారు.
ఇక, ఇప్పుడు అదే ఎంపీ ఏకంగా పార్లమెంట్ లోని అన్ని పార్టీల ఎంపీలకు విందు ఇచ్చేందుకు సిద్దమయ్యారు. ఇందుకు ముహూర్తం ఖరారు చేసారు. అయితే, చివరి నిమిషంలో రఘురామ రాజు విందు రాజకీయ వేదిక మారింది. ముందుగా నిర్ణయించుకున్న వేదిక కాకుండా.. మరోచోటకు మార్చారు. అమిత్ షా సైతం ఈ విందుకు హాజరవుతున్నట్లు సమాచారం. ఇంతకీ..రఘురామ రాజు తన సత్తా ఏంటో నిరూపించాలని భావిస్తున్నారా..
సీఎం జగన్..ఎంపీ రఘురామ రాజు మధ్యలో పవన్ కళ్యాణ్..! ఢిల్లీలో ఏం జరిగింది...!
ఎంపీ రఘురామరాజు విందు రాజకీయం వెనుక.
వైసీపీ ఎంపీ రఘురామ రాజు వైఖరి వైసీపీ నేతలకే కాదు..ముఖ్యమంత్రి జగన్ కు అంతుబట్టటం లేదు. ఎంపీగా గెలిచిన సమయం నుండి పార్టీకి విధేయుడిగానే ఉన్నా..బీజేపీ నేతలతో సన్నిహిత సంబంధాలు సాగిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ కు దీని పైన ఫిర్యాదులు రావటంతో...సీఎం నేరుగా ఈ అంశం మీద స్పందించిన ఎంపీలు ప్రధానిని లేదా కేంద్ర మంత్రులను కలిసే సమయంలో ఖచ్చితంగా సాయిరెడ్డి లేదా మిథున్ రెడ్డితో కలిసి వెళ్లాలని సూచించారు. ఇక, ఆ తరువాత పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో నేరుగా ప్రధాని..స్వయంగా రఘురామరాజును పలకరించటంతో..ఇక ఆ ఎంపీ క్రేజ్ పెరిగిపోయింది. ఆ తరువాత అమరావతి వచ్చి సీఎం ను కలిసి జరిగింది చెప్పారు. అప్పటి నుండి బీజేపీతో నిరంతరం ఏదో కారణంతో సఖ్యత కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన పార్లమెంట్ లోని 150 మంది ఎంపీలకు ఒక విందు ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఇప్పుడు కొత్త చర్చకు కారణమవుతోంది. ఈ విందు వెనుక రాజకీయం మీద భిన్న వాదనలు తెర మీదకు వచ్చాయి.
కేవీపీ నివాసంలో విందు..చివరి నిమిషంలో మార్పు
సబార్డినేట్స్ కమిటీ ఛైర్మన్ హోదాలో రఘురామరాజు ఈ నెల 11న ఢిల్లీలో ఎంపీలకు విందు ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే ప్రధాని..అమిత్ షా నుసైతం ఆహ్వానించారు. అయితే, ఈ విందును తొలుత తన వియ్యంకుడు కాంగ్రెస్ నేత..వైయస్సార్ ఆత్మగా పిలుచుకొనే కేవీపీ రామచంద్రరావు నివాసంలో ఏర్పాటు చేసారు. ఆంధ్రా రుచులతో పాటుగా సీఫుడ్ ను ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు. ఈ విందుకు దాదాపు అన్ని పార్టీల నేతలు హాజరవుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే, సీఎం జగన్ ను ఇప్పుడు ఎంపీ ఆహ్వానిస్తారా లేదా అనే చర్చ వైసీపీలో కొనసాగింది. అయితే, సీఎం ను సైతం ఆహ్వానించినట్లుగా చెబుతున్నారు. అయితే, తన తండ్రి మరణం తరువాత సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్న సమయం నుండి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా సీఎం జగన్ మాత్రం కెవీపీ రామచంద్రరావుతో దూరంగానే ఉంటున్నారు. ఆయన సైతం తన మిత్రుడు కుమారుడు సీఎం అవ్వటం పైన ఒక సందర్భంలో సంతోషం వ్యక్తం చేసారు. కానీ, ఈ ఆరు నెలల కాలంలో కలుసుకున్న సందర్భాలు లేవు. ఢిల్లీలో తనకు నివాసం కేటాయించకపోవటంతో కేవీపి నివాసంలో ఈ విందు ఏర్పాటు చేయటంతో సొంత పార్టీ నుండి అభ్యంతరాలు రావటంతో..చివరి నిమిషంలో వేదిక మార్చారు.
తన సత్తా చాటుకొనేందుకేనా.
రఘురామ రాజు తొలి నుండి బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 2014లోనే బీజేపీ నుండి నర్సాపురం ఎంపీ సీటు ఆశించారు. కానీ, చివరి నిమిషంలో గోకరాజు గంగరాజుకు దక్కింది. ఇక, ఆ తరువాత టీడీపీ..2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. ఇక, తాజా ఎన్నికల్లో వైసీపీ ఎంపీగా గెలిచారు. కానీ, కొద్ది రోజులుగా పార్టీలో తన మీద ఒక కీలక నేత ముఖ్యమంత్రికి ఫిర్యాదులు చేయటం.. పెత్తనం చేయటానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అసహనంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో..తన సత్తా ఏంటో చాటటం కోసమే ఈ విందు ఏర్పాటు చేసారని తెలుస్తోంది. తొలుత 300 మంది ఎంపీలు హాజరవుతారని భావించినా.. ఇప్పుడు ఈ విందుకు 150 మంది హాజరవుతున్నట్లు సమాచారం. కేవీపీ నివాసం నుండి విందు వేదికను జనపథ్ లోని లాన్స్ ఆఫ్ వెస్ట్రన్ కోర్టు లో ఏర్పాటు చేసారు. మరి..ఈ విందుకు సీఎం జగన్ తో సహా వైసీపీ నుండి ఎవరు హాజరవుతారనేది ఆసక్తి కరంగా మారింది.