జగన్కు సెగ గడ్డలా నిమ్మగడ్డ -కుక్క అనడం కొడాలి నాని తప్పుకాదు :ఎంపీ రఘురామ అనూహ్యం
వైసీపీ హైకమాండ్ దాఖలుచేసిన అనర్హత వేటు ఫిర్యాదు ఎంతకీ తేలకపోవడంతో ఆ పార్టీకే చెందిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శలదాడిని ముమ్మరం చేశారు. వైసీపీని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఉద్దేశించి ఎంపీ రఘురామ మరోసారి సంచలనల ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించబోమంటోన్న ప్రభుత్వం తెలివిగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ పైకి మంత్రి కొడాలి నానిని ఆయుధంగా ప్రయోగించిదన్నారు. పోలవరం ప్రాజెక్టును వదిలేసి, అక్కడ వైఎస్సార్ విగ్రహం కడతామనడం అనుచితమని ఆక్షేపించారు. 'రాజధాని రచ్చబండ'లో భాగంగా శుక్రవారం హైదరాబాద్ లో ఎంపీ మీడియాతో మాట్లాడారు. రఘురామ ఏమన్నారో ఆయన మాటల్లోనే..
నిమ్మగడ్డ రాజీనామా -జగన్ ఫర్మానా -ఏపీలో ఆర్టికల్ 356 -సుప్రీం తీర్పు ఇదే: ఎంపీ రఘురామ
సర్కారుకు సెగ గడ్డలా నిమ్మగడ్డ..
‘‘గత మూడు రోజులుగా స్థానిక ఎన్నికలపై చోటుచేసుకుంటోన్న పరిణామాలు, రాజ్యాంగ వ్యవస్థపై జగన్ సైన్యం దాడి చేస్తోన్న తీరును ప్రజలు గమనిస్తున్నారు. సమీక్షకు రావాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ఆదేశాలిస్తే అధికారులు ఎగ్గొట్టారు. కనీసం సమస్యలనైనా చర్చిద్దామని రెండోసారి పిలిచినా అధికారుల తీరు మారలేదు. నిమ్మగడ్డ పదవిలో ఉండగా ఎన్నికలు పెట్టబోమని ప్రభుత్వం డిసైడైపోయాందే తప్ప.. దీనికి కరోనా కారణం కానేకాదన్న ప్రజలందరికీ ప్రస్ఫుటంగా అర్థమైంది. తద్వారా జగన్ సర్కారు.. నిమ్మగడ్డను పెద్ద సెగ గడ్డగా ఫీలవుతోందన్నది తెలిసిపోయింది. నిజంలా జగన్ అలా భావించడం నిజంగా దుదృష్టం. ఇక్కడ కీలకమైన అంశమేంటంటే..
మగాడు గర్భవతి అయ్యింది -బయట పురుషాంగం, లోపల అండాల ఉత్పత్తి -నిజంగా అద్భుతమే
అందుకే కొడాలి నానిని దించారు..
ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను కుక్కతో పోల్చడం దగ్గర్నుంచి అనరానిమాటల్నీ మంత్రి కొడాలి నాని అనేశారు. మంత్రిత్రి చర్యలు కోరుతూ నిమ్మగడ్డ కూడా ఫిర్యాదు చేశారు. కానీ ఇక్కడ మనందరం కొనాలి నానిని అనవసరంగా, అన్యాయంగా ఆడిపోసుకుంటున్నాంగానీ, నానిని పనిముట్టుగా, రాజ్యాంగ వ్యవస్థల హత్యకు ఆయుధంగా వాడుకున్నారేగానీ, తెర వెనుక ఉండి ఇదంతా నడిపిస్తున్నది సీఎం జగనే. నాని కేవలం హత్యకు వాడిన కత్తి లాంటోడు. అతని కంటే హత్య చేసిన చేయి.. అంటే మాట్లాడించిన వ్యక్తిదే మొత్తం తప్పు. మొదటి నుంచీ కొడాలి వార్తలకు మంచి వ్యూయర్ షిప్, రేటింగ్ ఉంది. అసలే ఏపీలో అక్షరాస్యత శాతం ఏపీ వెనుకబడి ఉంది. నాని మాటలు అక్షరాస్యులకు కూడా నచ్చుతున్నట్లున్నాయి. అందుకే నానిని ఒక ఆయుధంగా నిమ్మగడ్డపైకి ప్రయోగించారు. ఒకరి తర్వాత ఒకరుగా పద్ధతి ప్రకారం రాజ్యాంగ వ్యవస్థలపై దాడి చేస్తున్నారు. ఇది కచ్చితంగా రాజ్యాంగ సంక్షోభానికి దారి తీస్తుంది.
టీచర్లతో మద్యం అమ్మించినప్పుడు కరోనా లేదా?
పార్టీల గుర్తులు లేకుండా ఎక్కడిక్కడ ఎన్నికలు.. అది కూడా ఫిబ్రవరిలో నిర్వహిద్దామని, కొవిడ్ నిబంధనల మేరకు ప్రణాళికలు రూపొందించాలని ఎన్నికల కమిషన్ భావిస్తుంటే.. ప్రభుత్వం మాత్రం.. టీచర్లు, ఉద్యోగులకు కరోనా భయాలున్నాయని చెబుతోంది. మరి ఇదే టీచర్లతో మొన్నటిదాకా మద్యం షాపుల ముందు డ్యూటీలు చేయించినప్పుడు కరోనా గుర్తుకురాలేదా? వైరస్ పీక్ స్టేజిలో ఉన్నప్పుడే టీచర్లలో మద్యం అమ్మించారు.. ఇప్పుడు కరోనా తీవ్రత తగ్గింది. ఒకవేళ అనుకోని అవాంతరాలు ఎదురవుతాయని భయపడ్డా, వచ్చే జనవరి నాటికి కరోనా వ్యాక్సిన్ ఎలాగో అందుబాటులోకి వస్తుంది. ఫిబ్రవరిలో ఎన్నికల కోసం చర్చిద్దాం రమ్మంటే ఉద్యోగులు కుదరదంటున్నారు. ఎవరిదో అండ చూసుకుని వాళ్లిలా వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో ఉద్యోగులే ఇబ్బందులు పడతారు. గతంలోనూ కొందరు ఉద్యోగులు చేయని తప్పులకు జైలుపాలైన సందర్భాలు చూశాం. ఉద్యోగులు రాజ్యాంగాన్ని గౌరవించాలే తప్ప.. ప్రభుత్వ పెద్దల అడుగులకు మడుగులొత్తేలా వ్యవహరిస్తే ఇబ్బందులు తప్పవు. ఏపీలో ఆర్టికల్ 356(రాష్ట్రపతి పాలన) విధించైనా సరే స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిందేనని ప్రజలే కేంద్రానికి రిప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు.
జగన్కు మళ్లీ పరాభవం తప్పదు
పొద్దున లేస్తే.. గాంధీగారు జగన్ రూపంలో మళ్లీ పుట్టారని వైసీపీ అగ్ర నేతలు రాస్తుంటారు. పల్లెప్రగతి, గ్రామస్వరాజ్యం గురించి గాంధీగారు మాట్లాడితే.. మళ్లీ పుట్టిన గాంధీనేమో స్థానిక ఎన్నికలు జరిపించబోనని అంటున్నారు. తమిళనాడుకు చెందిన కనగరాజ్ ఉంటేనే తప్ప ఎన్నికలు సజావుగా జరగబోవని ఎందుకు భావిస్తున్నారు? పరిస్థితి రాజ్యాంగ సంక్షోభానికి దారితీయకముందే ప్రభుత్వం మేల్కోవాలి. నిమ్మగడ్డను పదవి నుంచి తొలగించడానికి గతంలో చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ఇప్పుడు మళ్లీ అదే పని కోసం అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా నిమ్మగడ్డ విషయంలో జగన్ కు ఘోరపరాభవం తప్పదు. ఇది వైసీపీకేకాదు.. ఆ పార్టీకి ఓట్లేసిన ప్రజలకు కూడా పరాభవమే. ఎప్పుడు ఎన్నికలు జరిగినా సాధారణంగా అధికార పార్టీనే గెలుస్తుంది. ఎలాగో పార్టీ గుర్తులు లేవుకాబట్టి, జగన్ ప్రభుత్వం ఇంకో మూడున్నరేళ్లు ఉంటుంది కాబట్టి గెలిచినవాళ్లంతా వైసీపీకే మద్దతిస్తారు. అందుచేత నిమ్మగడ్డపై పంతానికి పోయి... దుందుడుకుతనంగా వ్యవహరించడం సరికాదు. న్యూట్రల్ ఓట్లు దెబ్బతినే అవకాశం ఉందని జగన్ గుర్తించాలి.
Recommended Video
ప్రాజెక్టు ముఖ్యమా? వైఎస్సార్ విగ్రహమా?
కామధేనువు లాంటి అమరావతిని అన్ని రకాలుగా ఇబ్బందుల్లోకి నెట్టారు. అటు ఏపీకి వరప్రదాయని లాంటి పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ వైసీపీ అవాకులు చెవాకులు పేలుతున్నారు. ఆర్థిక పరిస్థితిపై అవగాహన లేకుండా మంత్రులు, నేతలు నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. కరోనా దెబ్బకు కేంద్రం కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఏం? రాష్ట్రప్రభుత్వమే ముందుకొచ్చి నిధులు అడ్జెస్ట్ చేసుకుంటే తప్పేముంది? పైగా పోలవరం నుంచి విశాఖకు కూడా నీళ్లు తీసుకుపోతాం అంటున్నారు. అఫ్కోర్స్ విశాఖలో రాజధాని అసాధ్యం అయినప్పటికీ, పారిశ్రామిక అభివృద్ధికైనా పోలవరం పూర్తికావాల్సిందే. రాయలసీమకు కూడా పోలవరం చాలా ముఖ్యమైనది. మంత్రి బుగ్గన ఢిల్లీలో కష్టపడుతున్నా ఆయన సత్తా చాలడంలేదు. ఇకనైనా జగన్ శ్రద్ధ పెట్టి, ఢిల్లీకి వెళ్లి ప్రధానిని, ఆర్థిక మంత్రిని కలిసి ఎలాగోలా ఒప్పించి పోలవరం ముందుకెళ్లేలా చూడాలి. పోలవరం ప్రాజెక్టును వదిలేసి, అక్కడ అతిపెద్ద వైఎస్సార్ విగ్రహం కడతామని చెప్పడం ప్రజల్ని గందరగోళంలోకి నెట్టడమే. జగన్ తీరు చూస్తే.. ‘జోహార్' అనే సినిమాలో హీరోలా.. మిగతా పనులు వదిలేసి తండ్రి విగ్రహం కోసం తహతహలాడటం గుర్తొస్తుంది. విగ్రహం విషయంలో నిగ్రహం వహించకపోతే ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుంది. పోలవరం పూర్తయితే ఏపీ సర్ ప్లస్ బడ్జెట్ లోకి వస్తుంది. అప్పుడు ఇంతకంటే పెద్ద విగ్రహాలు కట్టుకోవచ్చు'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.