మంత్రి మతి లేకుండా: ఒక మతంపై ఆదరణ వల్ల మూల్యం తప్పదు: జగన్ అటెన్షన్: రఘురామ దీక్ష
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు నేతగా గుర్తింపు పొందిన లోక్సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు మరోసారి తన దూకుడు ప్రదర్శించారు. దేవాలయాల పరిరక్షణ కోసం ఆయన దీక్షకు దిగారు. ఎనిమిది గంటల పాటు నిరసన దీక్ష చేపట్టారు. దేశ రాజధానిలోని తన నివాసంలో రఘురామ ఈ ఉదయం ఆయన దీక్షను ప్రారంభించారు. హిందూ ఆలయాలను పరిరక్షించాలనే ఏకైక డిమాండ్తో తాను ఈ దీక్షను చేపట్టానని వెల్లడించారు. సొంత పార్టీ నేతలపై నిప్పులు చెరిగారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్పై ఘాటు విమర్శలు చేశారు.
అంతర్వేది ఘటన..కుట్ర: పిచ్చి చేష్టగా కేసు క్లోజ్: వెల్లంపల్లి వద్దు: జగన్ స్వయంగా: రఘురామ
వైఎస్ జగన్ అటెన్షన్ అవసరం..
రాష్ట్రంలో వరుసగా హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయని, వాటిని నివారించడానికి, దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలను తీసుకోవడానికి తాను ఈ దీక్షను చేపట్టినట్లు తెలిపారు. దాడులకు పాల్పడిన వారిపై చర్యలను తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వాన్ని కోరడమే తన దీక్షల ప్రధాన ఉద్దేమని తెలిపారు. మతి స్థిమితం లేనివారి చేష్టలుగా ప్రభుత్వం వాటిని కొట్టేయడం సరికాదని అన్నారు. పిచ్చివాళ్లు హిందూ దేవాలయాలు, రథాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నారా? అని ప్రశ్నించారు. హిందువుల మనోభావాలు ఇదివరకెప్పుడూ లేనంతగా గాయపడుతున్నాయని విమర్శించారు.
మతి లేని మంత్రి మాటలు..
అంతర్వేది సహా రాష్ట్రంలో ఇదివరకు చోటు చేసుకున్న ఆలయాల దాడులపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మతి లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. అంతర్వేదిలో దగ్ధమైనది రథం మాత్రమే కాదని, అయిదు కోట్ల మంది ప్రజల మనోరథాలు కాలిపోయాయని అన్నారు. ఈ ఘటనపై పోలీసులు నమ్మశక్యం కాని కారణాలను చెబుతున్నారని, ఆలయాల పరిరక్షణలో నిర్లిప్తత కనిపిస్తోందని విమర్శించారు. పిఠాపురంలో దేవతా విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని పట్టుకుని, శిక్షించి ఉంటే ఈ పరిస్థితులు తలెత్తేవి కావని రఘురామ అన్నారు.
ఏడాదికాలంలో 15 ఆలయాలపై
రాష్ట్రంలో ఏడాది కాలంలో 15 ఆలయాలపై దాడులు చోటు చేసుకున్నాయని అన్నారు. పిఠాపురం, కొండబిట్రగుంట, అంతర్వేదిల్లో సంభవించిన ఘటనలు యాదృశ్చికం కావని చెప్పారు. మతి స్థిమితం లేని వారి చర్యగా తేనెపట్టు కోసం చేసిన పనిగా సమర్థించడం నవ్వులాటగా కనిపిస్తోందని మండిపడ్డారు. హిందూ దేవాలయాల వద్ద అన్యమత ప్రచారాలు, ఆలయాల ఆస్తులు, మాన్యాలపై కొందరు పలుకుబడి గల వ్యక్తులు కన్నేశారని, వాటిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఒక పథకం ప్రకారం.. దాడులు చేస్తున్నారని విమర్శించారు.
Recommended Video
ఒక మతం వారి పట్ల ఆదరణ..
ప్రభుత్వం ఒక ప్రత్యేక మతం వారిని ఆదరిస్తోందని, మిగిలిన వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే అభిప్రాయం ప్రజల్లో నెలకొందని, అది ఏ లౌకిక ప్రభుత్వానికి కూడా మంచిది కాదని రఘురామ కృష్ణంరాజు అన్నారు. అలాంటి భావన ప్రజల్లో ఏర్పడితే.. దానికి ప్రభుత్వం రాజకీయంగా తీవ్ర మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుందని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం భూముల అమ్మకాల విషయంలో వైఎస్ జగన్ సకాలంలో స్పందించారని, ఓ పెద్ద ఉపద్రవాన్ని నివారించగలిగారని అన్నారు. ఇప్పుడు కూడా అలాంటి చర్యలు తీసుకోవాలని అన్నారు.