కోడిపందాల పేరుతో అమాయకుల అరెస్టులు- పోలీసులపై రఘురామ ఫైర్-తిరగబడాలంటూ
ఏపీలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించే కోడి పందాల నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తప్పుబట్టారు. పోలీసుల తీరుపై ఆయన ఇవాళ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో విగ్రహాల ధ్వంసం సహా పలు పరిణామాలు జరుగుతుంటే కారకుల్ని వదిలిపెట్టి కోడి పందాలపై ప్రతాపం చూపిస్తారా అంటూ రఘురామ విమర్శలకు దిగారు.
ఏపీలోని గోదావరి జిల్లాల్లో ఏటా జరిగే సంక్రాంతి కోడి పందాల్లో రఘురామరాజు ఉత్సాహంగా పాల్గొనేవారు. గతేడాది సంక్రాంతి తర్వాత నుంచి ఢిల్లీలోనే ఉంటున్న రఘురామరాజు సంక్రాంతి వేడుకల కోసం తిరిగొస్తారో లేక అక్కడే ఉండిపోతారో ఇంకా తేలలేదు. ఆ లోపే గోదావరి జిల్లాల్లో సంక్రాంతి కోడి పందాల సాకుతో అమాయకులను పోలీసులు అరెస్టులు చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. కత్తులు కట్టి కోడి పందాలు నిర్వహించవద్దని మాత్రమే కోర్టు చెప్పిందని రఘురామ గుర్తు చేశారు.
కోళ్లను పెంచడం నేరం కాదని, వాటి కాళ్లకు కత్తులు కట్టి పందాలు నిర్వహిస్తేనే తప్పని గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పులను రఘురామ ప్రస్తావించారు. అయినా పోలీసులు కోర్టు ఆదేశాల పేరుతో అమాయకులను వేధిస్తున్నారని రఘురామ ఆరోపించారు. జీవనోపాధి కోసం పెంచుకుంటున్న కోళ్లను సైతం పోలీసులు స్వాధీనం చేసుకోవడం సరికాదన్నారు. కోళ్లను ఎత్తుకెళ్లే వాళ్లు దొంగలని, దొంగలకు ఎలా బుద్ధి చెబుతారో వారికి కూడా అలాగే బుద్ధి చెప్పాలని రఘురామ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో విగ్రహాలు ధ్వంసం చేసే వారిని వదిలిపెట్టి కోళ్లు పెంచుకునే వారిపై ప్రతాపం చూపుతారా అని పోలీసులను ఆయన ప్రశ్నించారు.