సన్ రైజర్స్.. రైజింగ్ బ్యాట్స్మెన్కు గాయం?: నెక్స్ట్ మ్యాచ్కు డౌట్? దెబ్బ మీద దెబ్బ
అబుధాబి: ఐపీఎల్-2020 సీజన్ 13వ ఎడిషన్లో బోణీ కొట్టలేకపోతోన్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మరో ఇబ్బందిని ఎదుర్కొనబోతోందా? స్టార్ బ్యాట్స్మెన్ మనీష్ పాండే గాయ పడ్డాడా? చెన్నై సూపర్ కింగ్స్తో జరిగే తదుపరి మ్యాచ్లో ఆడే అవకాశాలు లేవా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. మనీష్ పాండే కండరాల (హ్యామ్స్ట్రింగ్) గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మూడో మ్యాచ్కు అందుబాటులో ఉంటాడా? లేడా? అనేది తేలాల్సి ఉంది. మనీష్ పాండేకు గాయమైనట్లు సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ మేనేజ్మెంట్ ఇంకా ధృవీకరించలేదు.
ఎండ్ ఆఫ్ ద రోడ్: చెన్నై సూపర్ కింగ్స్కు మిస్టర్ ఐపీఎల్ రివర్స్ షాక్: ధోనీ సేన నుంచి బయటికి?
ఫీల్డింగ్ చేస్తూ.. అర్ధాంతరంగా..
యుపైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో శనివారం రాత్రి కోల్కత నైట్ రైడర్స్తో మ్యాచ్ సందర్భంగా మనీష్ పాండే అర్ధాంతరంగా గ్రౌండ్ నుంచి బయటికి వెళ్లాడు. కోల్కత నైట్ రైడర్స్ బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో 14వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మహ్మద్ నబీ వేసిన 14వ ఓవర్లో ఇవాన్ మోర్గాన్ కొట్టిన షాట్ను అడ్డుకున్న అనంతరం మనీష్ పాండే గ్రౌండ్లో ఇబ్బందికరంగా కదిలాడు. ఆ వెంటనే మైదానాన్ని వీడాడు. ఆ సమయంలో అతను సరిగ్గా నడవలేకపోవడం కనిపించింది. కండరాలు పట్టేయడంతో అతను అర్ధాంతరంగా డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లాడని అంటున్నారు.
ఈలోగా కుదురుకుంటాడా?
దీనిపై సన్ రైజర్స్ టీమ్ వివరణ ఇవ్వాల్సి ఉంది. మనీష్ పాండే ఎందుకు గ్రౌండ్ను వీడాడనే విషయంపై టీమ్ మేనేజ్మెంట్ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. హ్యామ్స్ట్రింగ్ గాయం వల్లే అతను ఫీల్డింగ్ మధ్య నుంచి వెళ్లాడనే వార్తలు వెలువడుతున్నాయి. అదే జరిగితే- వచ్చేనెల 2వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో ఆడే అవకాశాలు దాదాపు ఉండకపోవచ్చని అంటున్నారు. చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్కు మరో అయిదు రోజుల మిగిలి ఉంది. ఈ లోగా మనీష్ పాండే కుదురుకుంటాడనే అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.
హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న మనీష్..
ప్రస్తుతం సన్ రైజర్స్లో ఫుల్ రైజింగ్లో ఉన్న క్రికెటర్ మనీష్ పాండే. కోల్కత నైట్ రైడర్స్తో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్లో మనీష్ పాండే హాఫ్ సెంచరీ చేశాడు. అతని చలవ వల్లే హైదరాబాద్ టీమ్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. 38 బంతుల్లో రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో అతను 51 పరుగులు చేశాడు. ఆండ్రీ రస్సెల్ బౌలింగ్లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో మనీష్ పాడే టాప్ స్కోరర్. కేప్టెన్ కమ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్-36, వృద్ధిమాన్ సాహా-30, మహ్మద్ నబీ-11 పరుగులు చేశారు. దీనితో జట్టు స్కోరు మొత్తం 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 142 పరుగులకు చేరింది.