బ్రిటన్ లో తెలుగు గ్రంధాలయం
బ్రిటన్ లోని మిల్టన్ కీనెస్ సెంట్రల్ లైబ్రరీలో మార్చి 23 సాయంత్రం తెలుగు పుస్తక విభాగం ప్రారంభమైంది. దీనిని మిల్టన్ కీనెస్ నగర్ మేయర్ జాన్ లాయ్డ్ ప్రారంభించారు. ఒక భారతీయ భాషా పుస్తక విభాగం విదేశీ గ్రంధాలయాల్లో ప్రారంభం కావడం గొప్ప విశేషమే. ఈ విషయంలో ఎంకెటిఎస్ కమిటీ చేసిన కృషి ప్రశంసనీయం. ఈ గ్రంధాలయంలో తెలుగు విభాగానికి పుస్తకాలు పంపించవలసిందిగా ఈ సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ విషయాన్ని మిల్టన్ కీన్స్ తెలుగు సంఘం తరఫున శ్రీధర్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ విధాన మండలి అధ్యక్షులు డాక్టర్ ఎ.చక్రపాణి, ప్రభుత్వ గ్రంధాలయాల డైరెక్టర్ శ్రీమతి ఎస్ వెంకమ్మ తెలుగు పుస్తకాలు కొన్ని ఇక్కడికి రావడానికి సహకరించారు. బ్రిటన్ లోని ఈ తెలుగు గ్రంధాలయ విభాగం 300 తెలుగు కుటుంబాలకు సహాయకారిగా ఉంది. తెలుగు భాషా సంస్కృతులను పరాయి గడ్డ మీద కూడా పరిరక్షించుకోడానికి ఇదొక సదుపాయం. బ్రిటన్ లో బహుశా ప్రపంచంలో ఇదే తొలి ప్రవాస తెలుగు గ్రంధాలయం కావచ్చని నిర్వాహకులు చెబుతున్నారు.