పురంధరేశ్వరికి ఘన సత్కారం
పురందేశ్వరిని సన్మానించిన తరువాత న్యూజెర్సీ గవర్నర్ జాన్ కొల్విన్ మాట్లాడుతూ, ఆంధ్రులు అత్యంత ప్రతిభావంతులని కొనియాడారు. అమెరికాలో వీరు అనేక రంగాల్లో చక్కగా రాణిస్తున్నారని ప్రశంసించారు. భారత సంస్కృతీ సంప్రదాయాలు ఉన్నతమైనవని ఆయన అభినందించారు. క్రమశిక్షణకు మారుపేరు తెలుగువారన్నారు. న్యూజెర్సీ రాజకీయాల్లో రాణిస్తున్న ఉపేంద్ర చివుకుల, క్రిష్ కల్లూరిని గవర్నర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. న్యూజెర్సీలోని తెలుగువారి సంక్షేమం పట్ల తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
అనంతరం సన్మాన గ్రహీత పురందేశ్వరి మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, నాగరికత, వాటి పవిత్ర గురించి ఆకట్టుకొనే రీతిలో ఆమెదైన శైలిలో ప్రస్తావించారు. వీటన్నింటినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉన్నదని ఆమె పిలుపునిచ్చారు. అమెరికాలో ఉంటున్నప్పటికీ ప్రవాసాంధ్రులు భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలను మరచిపోకుండా అన్ని పండుగలు, ఉత్సవాలను ఆసక్తిగా, ఆహ్లాదకరంగా, ఉత్సాహంగా నిర్వహించుకోవడం గర్వకారణం అన్నారు. అమెరికాలో తాను చేస్తున్న వారంరోజుల పర్యటనలో ప్రవాసాంధ్రులు సుమారు 70 వేల డాలర్లు వరద బాధితులకు విరాళంగా అందజేయడం ముదావహం అన్నారు.
రాష్ట్రంలో ఎన్నడూ చూడనంత ఉధృతంగా వరదలు ముంచెత్తి, వేలాది మంది పలు ఇబ్బందులు పడుతున్నారని, మరింత ఉదారంగా ముందుకు వచ్చి సహాయం చేయాలని పురందేశ్వరి విజ్ఞప్తి చేశారు. పురందేశ్వరి విజ్ఞప్తికి స్పందించిన సీతా కార్పొరేషన్ అధినేత రామిరెడ్డి 20 వేల డాలర్లకు చెక్కును మంత్రికి అందజేశారు. వరద బాధితుల సహాయార్థం సభలో ఉన్న ప్రవాస భారతీయులు అప్పటికప్పుడు 40 వేల అమెరికన్ డాలర్ల విరాళాలను మంత్రి పురందేశ్వరికి అందజేశారు.