సమాజాభివృద్ది కోసం తపిస్తున్న ఎంఎన్నార్ గుప్తా
భారతీయాత్మను విశ్వమానవ ఆత్మగా, తరతరాలపై చెరగని ముద్రవేసిన దార్శనికుడు స్వామి వివేకానంద ప్రవచనాలతో స్పూర్తి పొందిన ఎంఎన్ఆర్ గుప్తా...చదువుకునే రోజుల్నించే సమాజాన్ని గురించిన ఆలోచనలు చేశాడు. అంతమాత్రాన భూమిని ఉద్దరించాడని, మానవ సేవలో తరించాడని చెప్పబోవడం లేదు. తన తరం...ఈతరం యువతరంగంలో ఒక కొత్త కెరటమై లేచాడు. చాలామంది చేయనిది చేసి చూపించాలన్న తపనతో ఉన్నాడు.
సాధించినదానికి సంతృప్తిపడిపోవడం లేదు. అసలు గుప్తా కంటే తెలివైనవారూ...చేయగలిగేవారూ వందలు వేల సంఖ్యలో ఉండొచ్చు. కానీ గుప్తా గురించే చాలామంది ఎందుకు చెప్పుకుంటారంటే...అతను అనుసరిస్తున్న మార్గం కొంచెం భిన్నమైనది. తన వారికి అంటే తన దేశ ప్రజలకు ఏదో సేవ చేయాలన్న తపన..తపస్సు...దానిని నిజం చేయడానికి నిరంతరమైన ఆలోచన..అలుపెరగని శ్రమ. శ్రమించనిదే ఆలోచనకు వాస్తవరూపం రాదని, ఆలోచనకు ప్రశ్నే పునాదని నమ్మే గుప్తా...ఎక్కడో విదేశాలలో జీవనం సాగిస్తున్నప్పటికీ మాతృదేశానికీ అందునా ఆంధ్రదేశానికి సేవలు అందిస్తూనే ఉన్నాడు. శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆవిష్కరించే యత్నం చేస్తున్నాడు. అసలు ఎవరీ గుప్తా..ఓ సాదా సీదా కుటుంబం నుంచే వచ్చాడు. గుంటూరు జిల్లా వాసైన మద్దుల వెంకటరామయ్య, సీతామహాలక్ష్మి దంపతులు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో స్థిరపడ్డారు.
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ వరకూ గుప్తా చదవంతా భీమవరంలోనే సాగింది. ఎంటెక్ వరంగల్ రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీలో పూర్తి చేశాడు. 2000 నాటికి దేశంలో రహదారుల స్వర్ణయుగం నడుస్తూ ఉండటంతో గుప్తా ట్రాన్స్ పోర్టేషన్ లో ఎంటెక్ చేశాడు. పాఠశాల స్థాయిలోనే ప్రతిభావంతుడైన విద్యార్ధిగా పేరుతెచ్చుకున్న గుప్తా అనేక క్విజ్ పోటీల్లో పాల్గొని జాతీయస్థాయి వరకూ వెళ్ళాడు. ఎంటెక్ పూర్తయిన తరువాత జాతీయ రహదారుల ప్రాజెక్టులో హైవే ఇంజనీరుగా పనిచేసాడు. 2003 వరకూ రాజస్థాన్ లో పనిచేసిన గుప్తా ఆ తరువాత విదేశీ అవకాశాలను వెదుక్కున్నాడు. దానికి కారణం ఒక్కటే.
దశాబ్దకాలం నుంచి మన రాష్ట్రంలోని యువకులంతా తమ ప్రతిభకు తగిన గుర్తింపు రావాలని, అవకాశాలు రావాలని, భవిష్యత్ బాగుండాలని ఆశించడం మొదలు పెట్టారు. సరిగ్గా అవే కారణాలతో గుప్తా కూడా తన చదువుకు తగిన అవకాశం కోసం ఎదురుచూశాడు. ఒమన్ దేశంలో అవకాశం వచ్చింది. పెట్రోలియం ప్రాజెక్టులో ఇంజనీరుగా చేరిన గుప్తా 2005 నుంచి ఒమన్ సోహర్ ఇన్ ప్రాస్ట్రక్చర్ కంపెనీలో రోడ్స్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. గుప్తా భార్య సాహిత్య కూడా ఇంజనీరే కావడంతో ఒమన్ లో ఎల్ అండ్ టిలో ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్నారు.
ఒమన్ లో పదిమందితో గుప్తా ప్రారంభించిన వరల్డ్ తెలుగు ఫోరం ఇప్పుడు దాదాపు 30 దేశాలకు విస్తరించింది. విదేశాలలో ఉద్యోగాలు వెదుక్కునే తెలుగువారికి అది సహాయ సహకారాలు అందిస్తోంది. అలానే ఆంధ్రలో ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడల్లా ఫోరం అపన్నహస్తం అందిస్తోంది. అందుకే గుప్తాను దేశ విదేశాలలో ఉన్న తెలుగు వారంతా అభిమానిస్తారు. సాదరంగా ఆహ్వానించి సత్కరించి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. తెలుగు నేలపైనే కాదు తెలుగువాడున్న ఢిల్లీ, ముంబయి, చైన్నై, అమెరికా ఎన్నోచోట్ల ఈ యువకుడిని సన్మానించారు. వాటిని వినమ్రంగా స్వకరించే ఎంఎన్ఆర్ కప్పుకోడానికి శాలువాలు, లెక్కపెట్టుకోడానికి జ్ఞాపికలుగా భావించలేదు. తాను పడుతున్న శ్రమను, సేవను గుర్తించి శభాష్ అంటూ తెలుగువారి ప్రేమగా తలపోసి, తన బాధ్యత మరింత పెరిగిందనే భావనతోనే ఉంటారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనిషి.