డెట్రాయిట్లో తెలంగాణ బతుకమ్మ పండుగ
ఈ బతుకమ్మ ఉత్సవాలు ఇండియా నుండి ప్రత్యేక అతిధులుగా వచ్చిన ప్రముఖ తెలంగాణా కళాకారులు గోరేటి వెంకన్న, 'మా భూమి' సంధ్య జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలకు హాజరైన యువతులు, పిల్లలు వివిధ రకాల రంగుల సంప్రదాయ చీరలు, దుస్తులు ధరించి చక్కని రంగు రంగుల పుష్పాలతో తో పేర్చిన బతుకమ్మల చుట్టూ తిరుగుతూ "బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో" అని పాడుకుంటూ, చప్పట్లతో అక్కడ వున్న వాతావరణాన్ని ఉత్తేజపరిచారు. చక్కగా పేర్చి అలంకరించిన ఉత్తమ బతుకమ్మలకు ప్రత్యేక అతిధులు బహుమతులు అందచేసారు.
డిట్రాయిట్ తెలంగాణా కమ్యూనిటీ(డిటిసి) అధ్యక్షుడు భరత్ మాదాడి మాట్లాడుతూ, తెలంగాణా ఆచారాలను, సంస్కృతిని సంరక్షించడానికి, డిట్రాయిట్ ప్రజలకి అహగాహన కలిగేల గత ఆరు సంవత్సరాలుగా డిటిసి చేస్తున్న వివిధ తెలంగాణా కార్యక్రమాలను వివరిస్తూ కొత్తగా ఎన్నికై కార్యవర్గమైన శైలేంద్ర సనం -చైర్మన్, నాగేంద్ర ఐత -ప్రెసిడెంట్ ఎలెక్ట్, వెంకట్ మంతెన -సెక్రటరీ, రాజు బ్రహ్మండభేరి -జాయింట్ సెక్రటరీ, భుజంగ రావు - ట్రెజరర్, సునీల్ మర్రి - జాయింట్ ట్రెజరర్ లను అందరికి పరిచయం చేసారు. డిటిసిని అభివృద్ధి చేయడానికి, కార్యక్రమాలను విజయవంతం చేయడానికి అక్కడికి విచ్చేసిన వారిని సభ్యులుగా కావాలని పిలుపు నిచ్చారు.
కార్యక్రమంలో భాగంగా, సాంస్క్రతిక కార్యక్రమాలను గోరేటి వెంకన్న, 'మా భూమి' సంధ్య తెలంగాణా పాటలతో ప్రారంభించారు . వీరు పాడిన తెలంగాణా పల్లె పాటలు, తెలంగాణా గేయాలు ప్రతి ఒక్కరి మదిని పాత జ్ఞాపకాల్లోకి తీసుకువెళ్ళాయి. ఈ కార్యక్రం మరింత రసవత్తంగా జరగడానికి చిన్న పిల్లల జానపద,శాస్త్రీయ, చలన చిత్ర నృత్యాలు ఎంతో దోహద పడ్డాయి. ఈ కార్యక్రమం లో తమ ఆట పాటలతో అలరించిన చిన్నారులకు కార్యవర్గ సభ్యులు బహుమతులు అందచేసారు. తెలంగాణా సంస్కృతికి అద్దం పట్టే ఈ సాంస్క్రతిక కార్యక్రమాలను సువర్ణ దేవర, నాగేంద్ర ఐత చక్కగా నిర్వహించారు.
డిట్రాయిట్ తెలంగాణా కమ్యూనిటీ(డిటిసి) కార్యవర్గ సభ్యులు ఇండియా నుండి ప్రత్యేక అతిధులు గా వచ్చి వారి పాటలతో అందరి మనసులని ఆహ్లాద పరిచిన గోరేటి వెంకన్న, 'మా భూమి' సంధ్యలను పుష్పగుచ్చాలతో, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం ఘన విజయం సాధించడానికి చేయూత నిచ్చిన గ్రాండ్ స్పాన్సర్స్ కాశి కొత్త (బ్రాడ్ గేట్ ఇంక్), డాక్టర్ జ్యోతి నిచనలను సభా ముఖంగా కార్యవర్గ సభ్యులు ప్రశంసిస్తూ సత్కరించారు. ఈ సందర్భంగా, ఘుమ ఘుమలాడే తెలంగాణా వంటకాలను ఆహుతులందరికి వడ్డించారు. ఈ కార్యక్రమం ఘన విజయం సాధించడానికి కార్యవర్గ సభ్యులతో పాటు శ్రీధర్ బండారు , మురళి బొమ్మనవేని , వెంకట్ దేవర, హరి మారోజు , హరి పరాంకుశం , రాంగోపాల్ ఉప్పుల , తిరు వెంగంటి విశేష కృషి చేసారు.