ట్రైవ్యాలీ ఆంధ్ర విద్యార్థుల గోడు
ట్రైవ్యాలీ వర్సిటీ పలువురు విదేశీ విద్యార్థుల్ని అక్రమంగా వివిధ కోర్సుల్లో చేర్చుకుందని ఐసీఈ అధికారులు తమ విచారణలో గుర్తించారు. పలువురు విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయంలో రెసిడెన్షియల్, ఆన్లైన్ కోర్సులను చదువుతున్నారు. వీరంతా కాలిఫోర్నియాలో ఉంటున్నట్లు రికార్డుల్లో చూపించినా, వాస్తవానికి అమెరికాలోని వేర్వేరు నగరాల్లో నివసిస్తూ అక్రమంగా ఉద్యోగాలు చేసుకుంటున్నట్లు అధికారులు కాలిఫోర్నియా న్యాయస్థానానికి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీసా మోసాలపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి పీజే క్రౌలే స్పందిస్తూ.. 'వీసాలను జారీ చేసిన తమ శాఖ సహకారంతో మోసాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు' అని విలేకరులకు తెలిపారు. 9/11 సంఘటన తర్వాత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామనీ, విద్యార్థి వీసాలపై వచ్చే వారు కళాశాలలకు మాత్రమే వెళ్లాలని పేర్కొన్నారు.
విశ్వవిద్యాలయం మూసివేత సంఘటనపై నివేదిక ఇవ్వాలంటూ భారత్ తన దౌత్య వర్గాల్ని కోరింది. ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ఎం కృష్ణ తెలిపారు. భారత విద్యార్థుల సంక్షేమాన్ని దౌత్య కార్యాలయం పర్యవేక్షిస్తుందన్నారు. బాధిత విద్యార్థులు ఇప్పటి వరకూ భారత కాన్సులేట్ను సంప్రదించలేరని తెలిపారు.