అమెరికాలో ఎస్పీ బాలు కచ్చేరీ
డల్లాస్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) డల్లాస్లో ఈ నెల 22వ తేదీ శనివారంనాడు పద్మభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం సంగీత కచ్చేరీని ఏర్పాటు చేసింది. బాలసుబ్రహ్మణ్యంతో పాటు పద్మశ్రీా కెఎస్ చిత్ర, ఎస్పీ శైలజ, ఎస్పీ చరణ్ కచ్చేరీ చేశారు. ఆస్టిన్లోని టెక్సాస్ విశ్వవిద్యాలయం ఐదేళ్ల తెలుగు బోధనా కార్యక్రమానికి విరాళాలు సేకరించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 1,800 ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
రాజేశ్వరి ఉదయగిరి, విజయ చంద్రహాస్ మద్దుకూరి ఆహ్వానం పలికి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తానా సౌత్ వెస్ట్ ప్రాంతీయ ప్రతినిధి మంజులత కన్నెగటిం తానా చేసిన సేవలను గుర్తు చేశారు. తెలుగు భాషాభివృద్ధి చైర్ కెసి చేకూరి మహాకవి గురజాడ గురించి వివరించారు. యుటి ఆస్టిన్ తెలుగు ప్రోగ్రామ్ చైర్ కృష్ణ చేబ్రోలు, 19వ తానా సమ్మేళనం సమన్వయకర్త మురళీ వెన్నం సమ్మేళనాన్ని విజయవతం చేయాలని కోరారు. తానా సమ్మేళనం వచ్చే ఏడాది మే 24- 26 తేదీల మధ్య డల్లాస్లో జరుగుతుంది.
గత 35 ఏళ్లుగా తానా చేస్తున్న కమ్యూనిటీ సేవలను కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డల్లాస్ మేయర్ ప్రో-టెమ్ పాలిన్ మెడ్రానో ప్రశంసించారు. తానా అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర కార్యక్రమానికి హాజరైన ప్రోటెమ్ మాడ్రెనోకు కృతజ్ఞతలు తెలిపారు. సంక్షిప్త ప్రసంగాల తర్వాత బాలు సంగీత కచ్చేరి జరిగింది. దాదాపు మూడు గంటల పాటు బాలు బృందం ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఏ దివిలో విరిసిన పారిజాతమో.. వంటి క్లాసిక్స్తో పాటు యమహో నీ యమ యమ వంటి పాటల వరకు ఆలపించారు.
సన్మాన కార్యక్రమం తర్వాత ఆర్కెస్ట్రా సభ్యులకు మెమెంటోల ప్రదానం జరిగింది. బాలును తానాతో పాటు టాంటెక్స్, ఐఎఎన్టి, ఆటా, నాటా, టిసిఎ హౌస్టన్, కళావాహిని వంటి సంస్థలు సత్కరించాయి. తానా కార్యదర్సి రామ్ యలమంచిలి వందన సమర్పణ చేశారు.