నార్వే జైలుకు టెక్కీ జర్నీ ఇలా..
ఉన్నత చదువుల కోసం చంద్రశేఖర్ హైదరాబాదుకు వచ్చారు. ఆయన తండ్రి వి. సత్యనారాయణ స్వగ్రామంలోనే ఉంటున్నారు. ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్లో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత చంద్రశేఖర్ నిక్, విప్రో సంస్థల్లో పనిచేశారు. ఐదేళ్ల క్రితం టిసిఎస్లో చేరారు. ఆయన భార్య అనుపమ కూడా ఇంజనీరే. వారికి శ్రీరామ్, అభిరామ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. చంద్రశేఖర్ కుటుంబానికి హైదరాబాదులోని మియాపూర్లో అపార్టుమెంటు ఉంది. శ్రీరామ్ హైపర్ సెన్సిటివ్ కావడంతో అనుపమ ఉద్యోగం చేయడానికి ఇష్టపడలేదు.
అనుపమ తల్లిదండ్రులు హైదరాబాదులో ఉంటారు. టిసిఎస్లో సీనియర్ మేనేజర్ అయిన చంద్రశేఖర్ ఆఫీసు పని మీద ఏడాదిన్నర క్రితం నార్వేలోని ఓస్లో వెళ్లారు. కుమారుడిని హింసించారనే ఆరోపణపై ఓస్లో కోర్టు చంద్రశేఖర్కు 18 నెలలు, అనుపమకు 15 నెలలు జైలు శిక్ష విధించింది.
కూతురు, అల్లుడికి జైలు శిక్ష విధించినట్లు తెలియడంతో హైదరాబాద్లోని సైదాబాద్లో నివసిస్తున్న అనుపమ తల్లిదండ్రులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తమ కూతురు, అల్లుడి అరెస్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరిగా స్పందించలేదని అనుపమ తండ్రి ఎల్.వీరభద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులను జైలులో పెట్టి పిల్లలకు చేసిన న్యాయమేమిటని ప్రశ్నించారు.
కాగా, చంద్రశేఖర్, అనుపమల కేసు విషయంలో కేంద్రం ఆచితూచి స్పందించింది. తీర్పును పరిశీలించిన తర్వాతే తగిన న్యాయ సహాయం చేస్తామని విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తెలిపారు. నార్వేలోని భారత రాయబారితో, అక్కడి ప్రభుత్వంతో తాను మాట్లాడుతున్నట్లు తెలిపారు. ఇక ఆ దేశ చట్టాల ప్రకారమే భారతీయ దంపతులను నార్వే జైల్లో పెట్టిందని, ఇదేమీ నేరం కాదని ప్రవాస భారతీయ శాఖ మంత్రి వయలార్ రవి అన్నారు.