లండన్ వీధుల్లో తెలంగాణ మార్చ్
ఈ మార్చ్లో తెలంగాణ జెఎసి హైదరాబాద్ చైర్మన్ శ్రీధర్, తెలంగాణ ఎన్నారై ఫోరం వ్యవస్థాపకుడు గంప వేణుగోపాల్, ఎన్నారై తెరాస విభంగా అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, బిజెపి ప్రతినిధి రంగుల సుధాకర్, సిపిఐ ప్రతినిధి దత్త సతీష్ మాట్లాడారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహం వద్ద మానవ హారం నిర్వహించి, గాంధీకి వినతిపత్రం, పుష్పగుచ్ఛాలు సమర్పించి శాంతి ర్యాలీని ప్రారంభించారు. అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. తెలంగాణ ఇవ్వాలనే నినాదాలతో సాగిన ర్యాలీ బ్రిటిషర్లను ఆకట్టుకుంది.
తెలంగాణ ప్రకటనను చేయించే బాధ్యతను తెలంగాణ మంత్రులు, శాసనసభ్యులు తీసుకోవాలని శ్రీధర్ డిమాండ్ చేశారు. అన్ని రాజకీయ పార్టీలు ఒకే వేదికపైకి వచ్చి తెలంగాణ ఎన్నారై ఫోరానికి మద్దతుగా నిలిచి తెలంగాణ కోసం పోరాటం చేయడం దేశ చరిత్రలో ఇదే ప్రథమమని వేణుగోపాల్ అన్నారు. హైదరాబాద్లో జరిగిన పోలీసు, ప్రభుత్వ చర్యలపై శ్వేతపత్రం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
అతి పెద్ద ప్రజాస్వామ్యంలో హైదరాబాద్లో జరిగిన పోలీసు చర్య అత్యంత దారుణమైందని అనిల్ కూర్మాచలం అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పొసగకపోతే ఎప్పుడైనా ఇరు ప్రాంతాలు విడిపోవచ్చునని భారత ప్రథమ ప్రధాని నెహ్రూ చెప్పిన మాటలను బిజెపి ప్రతినిధి సుధాకర్ గుర్తు చేస్తూ వెంటనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రకటన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణకు తమ పార్టీ మద్దతు ఉంటుందని, తెలంగాణ సాధనలో సిపిఐ ఎప్పుడూ ముందు భాగాన్నే ఉంటుందని సిపిఐ ప్రతినిధి సతీష్ అన్నారు. పార్లమెంటులో బిల్లు ప్రతిపాదించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ అనంతరం ఇండియన్ ఎంబసీలో వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిక్కు చందు, శ్రీకాంత్ పెద్ది, రాజ్ కుమార్, బాలసూరి సుమన్, అశోక్ దాసోజు, వెంకట్ తాళ్ల, పిట్ల శ్యామ్, నర్సారెడ్డి తూటికూర, కృష్ణబాబు, ప్రశాంత్, జితేందర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.