డల్లాస్ సందర్శించిన తులసి గబ్బర్డ్
డల్లాస్: ప్రముఖ హిందూ - అమెరికన్ రాజకీయవేత్త డల్లాస్ సందర్శించారు. ప్రస్తుతం ఆమె హోనోలులు నగరం కౌన్సిల్ వుమెన్గా ఉన్నారు. హవాయి స్టేట్ రిప్రజెంటిటివ్గా ఇంతకు ముందు పనిచేశారు. ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ (ఐఎఎఫ్సి) విజ్ఞప్తి మేరకు ఆమె డల్లాస్కు వచ్చారు. తీరిక లేకపోయినప్పటికీ, వచ్చే వారం సాధారణ ఎన్నికలు ఉన్నా లెక్క చేయకుండా డల్లాస్లోని హిందూ, ఇండియన్ - అమెరికన్ నేతలను కలుసుకోవడానికి వచ్చారుట.
బాల్యం నుంచే హిందూ సంస్కృతిని ఆచరిస్తూ శాకాహారి మాత్రమే అయిన గబ్బర్డ్ భారత సంతతికి చెందినవారు కారు. ఆమె తండ్రి మైక్ గబ్బర్డ్ కాథలిక్ క్రిస్టియన్. ప్రస్తుతం హవాయి స్టేట్ సెనేటర్గా ున్నారు. ఆయన అమెరికన్ సమోవాకు చెందినవారు. ఆమె తల్లి కరోల్ పోర్టర్ గబ్బర్డ్ శ్వేత జాతి అమెరికన్ మిచిగాన్ స్టేట్కు చెందినవారు. ఆమె హిందూ ఆచారాలను పాటిస్తున్నారు.
ఆ దంపతులు తమ ఐదుగురు పిల్లలను కర్మయోగ విలువ ప్రాధాన్యంతో పెంచారు. సేవాగుణంతో పనిచేయాలని ఉద్బోధించారు. వారి జీవనశైలి కూడా అందుకు అనుగుణంగానే ఉంటుంది. ఆ దంపతులకు పుట్టిన బిడ్డ తులసి. డల్లాస్లో తులసి గబ్బర్డ్ హరిహర పీఠంతో పాటు పలు హిందూ దేవాలయాలను సందర్శించినట్లు ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ టెక్సాస్ స్టేట్ సమన్వయకర్త ప్రసాద్ తోటకూర ఓ ప్రకటనలో తెలిపారు.
గ్రౌండ్ బ్రేకింగ్ ఉత్సవంలో ఆమె ప్రసంగించారు. ఈ ఉత్సవానికి సద్గురు బోధినాథ్ వేలాయనస్వామి, సద్దుగురు శివాయ సుబ్రహ్మణ్యస్వామి కూడా హాజరయ్యారు. హిందూ తాత్వికత పట్ల తన నిబద్ధతను తులసి తన ప్రసంగంలో వివరించారు. ఇరాక్, కువైట్ల్లో హావాయ్ నేషనల్ గార్డ్ కెప్టెన్గా పర్యటించినప్పుడు శాసనాలను చదవడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు ఆమె తెలిపారు.
ప్రసాద్ ఇండియన్ రెస్టారెంట్ (ఇర్వింగ్)లో ఆమె స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు. డిసెంబర్లో వాషింగ్టన్ డిసిలో హవాయ్ యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటెటివ్ ఆఫ్ సభ్యురాలిగా భగవద్దీతపై ప్రమాణం చేస్తానని చెప్పారు. తాను ఎక్కడికి వెళ్లినా వెంట భగవద్గీత ఉంటుందని చెప్పారు.
హిందూ ఆచారాలను పాటిస్తున్న తులసి కాంగ్రెసులో భారత గొంతును వినిపిస్తారని, తొలి హిందూ అమెరికన్గా అమెరికా రాజకీయాల్లో తులసి గబ్బర్డ చరిత్ర సృష్టిస్తారని రఘు తోటకూర అన్నారు. రిసెప్షన్కు హాజరైనవారి సంతకాలతో ప్రసాద్ తోటకూర, సంజయ్ భగవద్గీత గ్రంథాన్ని తులసి గబ్బర్డ్కు ప్రదానం చేశారు.