కూచిపూడిలో మెడికల్ క్లినిక్
టెక్సాస్: కృష్ణా జిల్లాలోని కూచిపూడిలో ఎకోస్ ఆఫ్ ఇండియా మెడికల్ క్లినిక్ను ఏర్పాటు చేస్తోంది. ఇందుకు తానా ఇకెజి పరికరాలను అందజేసింది. ఈ విరాళం అందించిన తానాను అభినందించడానికి మార్చి 29వ తేదీన టెక్సాస్లో సమావేశం ఏర్పాటు చేసింది. ఎకోస్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకాధ్యక్షులు ప్రణమ్య సూరి, సహ వ్యవస్థాపకుడు వసంత్ సూరి, డైరెక్టర్ ప్రన్హుతి సూరి తానా అధ్యక్షుడు ప్రసాద్ తోటకూరను ముఖ్య అతిథిగా వేదిక మీదికి ఆహ్వానించారు. ఆయనతో పాటు 19వ తానా సమ్మేళనం సమన్వయకర్త మురళీ వెన్నం, కార్యదర్శి చలపతిరావు కొండ్రకుంట, విద్యాదానం డైరెక్టర్ గోపాల్ పొనంగి, ఫిజిషియన్, కమ్యూనిటీ లీడర్ డాక్టర్ రాజేష్ అడుసుమిల్లిలను వేదిక మీదకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమానికి పలువురు తానా సభ్యులు, ఎకోస్ ఆఫ్ ఇండియా విద్యార్థి స్వచ్ఛంద సేవకులు హాజరయ్యారు. శోభిత పోచిరాజు, సిప్లిత పోచిరాజు, ప్రియాంక పొత్తూరి, శ్రుతి పొత్తూరి, శ్రీరాగిణి ఘంటసాల, మైత్రేయి అబ్బూరు, అనన్య పొనంగి ఎకోస్ విద్యార్థి వాలంటీర్లలో ఉన్నారు. తల్లిదండ్రులు జానకి పోచిరాజు, సుమా నూకల, సత్యవతి అబ్బూరు, పూర్ణిమ పొత్తూరి కూడా పాల్గొన్నారు.
ఎకోస్ ఆఫ్ ఇండియాకు నాట్యంజలి కూచిపూడి డ్యాన్స్ స్కూల్ విద్యార్థులు ఇతోధిక ప్రోత్సాహం అందిస్తున్నారు. దాంతో నాట్యాంజలి 2012లో వైద్య శిబిరాన్ని స్పాన్సర్ చేసింది. కూచిపూడి మెడికల్ క్లినిక్కు ఇకెజి పరికరాలను అందించిన తానా అధ్యక్షుడు ప్రసాద్ తోటకూరకు ఎకోస్ ఆఫ్ ఇండియా ప్రణమ్య సూరి, ప్రన్హుతి సూరి ప్రారంభోత్సవం తొలి ఆహ్వాన పత్రాన్ని అందించారు. తానాకు భాగస్వామ్య సర్టిఫికెట్ కూడా అందజేశారు.
ప్రతిష్టాత్మకమై కూచిపూడి మెడికల్ క్లినిక్ ఉగాది పర్వదినం రోజు ప్రారంభమవుతుంది. తానా ప్రతినిధులు సమావేశంలో ప్రసంగించారు. కూచిపూడి క్లినిక్కు దివంగతులైన పద్మభూషన్ వెంపటి చినసత్యం, పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ ఆశీస్సులతో పాటు వెంపటి వెంకట్, వెంపటి రవి. పద్మశ్రీ డాక్టర్ శోభా నాయుడు, జైకిశోర్ మొసలికంటి, పసుమర్తి వెంకటేశ్వర శర్మ, ఇతర కూచిపూడి పెద్దల ఆశీస్సులు కూడా ఉన్నాయి.
ఈ ప్రాజెక్టుకు వేదాంతం రాఘవ, వేదాంతం వెంకట్, తాడేపల్లి సత్యనారాయణ, ఇతర స్థానిక కూచిపూడి కళాకారుల మద్దతు ఉంది.