వర్సిటీ క్లోజ్: భారత విద్యార్థులపై దెబ్బ
వాషింగ్టన్: భారత విద్యార్థులు అధికంగా ఉన్న మరో అమెరికా విశ్వవిద్యాలయం మూతపడింది. మూడేళ్ల లోపల మూడో విశ్వవిద్యాలయం భారత విద్యార్థుల కొంప ముంచింది. యూనివర్సిటీ ఆఫ్ నార్తర్న్ వర్జీనియాను తక్షణమే మూసేయాలని ప్రభుత్వం ఆదేశించింది. భారత విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయంలో ఎక్కువగా చేరుతుంటారు. మూత పడడంతో ఆ విశ్వవిద్యాలయంలో చదువుతున్న భారతీయ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
వర్జీనియాలోని స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఎస్సీహెచ్ఈవీ) వర్సిటీ మూసివేతకు ఆదేశాలు జారీ చేసింది. ఆ యూనివర్సిటీ ఐదేళ్లుగా 'యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్'కు చెందిన ఏ విభాగం నుంచీ గుర్తింపు పొందకపోవడమే దీనికి కారణం. విదేశీ విద్యార్థులను ఎక్కువగా చేర్చుకునే ఈ విశ్వవిద్యాలయ వైఖరిపై ఇమిగ్రేషన్ అధికారులు 2011లో అనుమానం వ్యక్తం చేశారు.
క్యాంపస్పై దాడులు జరిపి తనిఖీలు చేశారు. ఈ వర్సిటీలో అర్హులైన అధ్యాపకులు లేరని, సరైన పాఠ్యప్రణాళిక కూడా లేదని ఎస్సీహెచ్ఈవీ పరిశీలనలో తేలింది. పైగా, ఈ వర్సిటీ మాజీ చాన్సలర్ ఒకరు వేశ్యాగృహాల్ని నడిపేవారట. అమెరికా వీసా పొందాలనుకునేవారికి ఈ వర్సిటీ రాజమార్గంలా ఉపయోగపడుతోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎస్సీహెచ్ఈవీ మూసివేతకు నిర్ణయం తీసుకుంది.
జూలై 17వ తేదీ విద్యార్థుల జాబితా, వారి వీసా స్థితి, వారి ఆర్థిక స్థితిగతులకు సంబంధించిన రికార్డులు సమర్పించాలని వర్సిటీని కోరింది. వర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థులను ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్, ఇమిగ్రేషన్ల నిమిత్తం వెంటనే తమ ఎఫ్-1 వీసాలతో డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీలో సంప్రదించాలని ఆదేశించింది. నార్తర్న్ వర్జీనియా యూనివర్సిటీ 1998లో ప్రారంభమైంది.
2003లో అక్రెడిటింగ్ కౌన్సిల్ ఫర్ ఇండిపెండెంట్ కాలేజీస్గా మార్చారు. 2007లో మళ్లీ అక్రెడిటేషన్ పొందలేదు. ఆ పాపమే వెంటాడి తాజా నిర్ణయానికి కారణమైంది. 2012లో ఆడిట్ నిర్వహించినప్పుడు అక్రెడిటేషన్ లేదన్న విషయాన్ని మరోసారి గుర్తించిన ఎస్సీహెచ్ఈవీ 2013 జూన్కల్లా గుర్తింపు పొందాలని సూచించింది.