రాజకీయ పార్టీ అవసరమైంది: ప్రశాంత్ భూషణ్
లండన్: రాజకీయ ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాల్సిన అనివార్యత గురించి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ప్రశాంత్ భూషణ్ ఎన్నారైలకు వివరించారు. ఆమ్ ఆద్మీ పార్టీ యుకె గ్రూప్ ఏర్పాటు లండన్లోని సౌత్ హ్యారో హెలియోస్ ఇంటర్నేషనల్ కాలేజీలో ఈ నెల 16వ తేదీన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దాదాపు 75 మంది ఎన్నారైలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
బెడ్ఫోర్డ్, బర్మింగ్హామ్, గ్లాస్దో, మాంచెస్టర్ వంటి ప్రాంతాల నుంచి ప్రశాంత్ భూషణ్ ప్రసంగాన్ని వినడానికి ఎన్నారైలు వచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ దృక్పథాన్ని ప్రశాంత్ భూషణ్ వివరించారు. అవినీతి పునాదుల్లోకి చొచ్చుకుపోయిన తీరును, అది భారత సార్వభౌమత్వానికి భంగకరంగా పరిణమిస్తున్న తీరును ఆయన వివరించారు
సవివరమైన ప్రసంగం తర్వాత ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ, రుజువర్తనం, పారదర్శకత, ఆర్థిక విధానం వంటి విషయాలపై వచ్చిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ అంశాలపై తలెత్తిన వివాదాలపై స్పష్టత రావడానికి ఈ ప్రశ్నలు, సమాధానం పద్ధతి ఉపయోగపడింది.
కొత్తగా 30 మంది ఆమ్ ఆద్మీ పార్టీ యుకె గ్రూపులో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. భారత టీమ్, యుకె గ్రూప్ కలిసి పనిచేయడం ద్వారా వివిధ విషయాలపై మంచి ఫలితం వస్తుందనే విషయాన్ని ప్రశాంత్ భూషణ్ అంగీకరించారు. ఈ సమావేశానికి కోవెంట్రీ మాజీ కౌన్సిలర్ రాజ్ మల్హోత్రా అధ్యక్షత వహించారు. ఆమ్ ఆద్మీ యుకె గ్రూప్ సమన్వయకర్త రాజ్ రెడిజ్ గిల్ తమ గ్రూప్ గురించి వివరించారు.