తెలుగువారు గర్వించేలా తానా సభలు
తెలుగువారు గర్వించేలా తానా సభలు నిర్వహిస్తామని అధ్యక్షుడు సతీష్ వేమన చెప్పారు. జులై 4వతేదీ నుంచి మూడు రోజుల పాటు అమెరికా వాషింగ్టన్ డీసీలో 22వ తానా సభలు అట్టహాసంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. అమెరికాలోనే కాక తెలుగు రాష్ట్రాల్లోనూ తానా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని, వాటి కోసం ఇప్పటి వరకు 700కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు.
తానా సభలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో పాటు తెలుగు రాష్ట్రాల సీఎంలు, పలువురు మంత్రులను ఆహ్వానించనున్నారు. సభలకు హాజరుకావాలని ఇప్పటికే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి తానా పాలకవర్గ సభ్యుడైన ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఆహ్వానం అందజేశారు. దాదాపు 400 మంది సభ్యులు 40 కమిటీలు సదస్సును దిగ్విజయంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారని సతీష్ వేమన ప్రకటించారు.
మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి ఆధ్వర్యంలో గాయనీగాయకులతో సంగీత విభావరితో పాటు పలువురు సినీ ప్రముఖులు, హాస్య నటులు కార్యక్రమంలో పాల్గొంటారని సతీష్ చెప్పారు. 40ఏళ్ల తానా చరిత్రలో తొలిసారి 45 మందితో కూడిన కార్యవర్గం ఏకగ్రీవం కానుందని, దీంతో ఎన్నికల నిర్వాహణ ఖర్చు రూ.70లక్షలు, అభ్యర్థులిచ్చే రూ.4.5 కోట్లు మిగులుతాయని చెప్పారు. అమెరికాలో తెలుగువారు గర్వించేలా ఇరవై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో తానా భవన్ నిర్మిస్తున్నామని చెప్పారు.