టెక్సాస్ రోడ్డు ప్రమాదం: తెలంగాణకు చెందిన కుటుంబం దుర్మరణం: ఆర్టీసీ కండక్టర్గా
నారాయణపేట్: అమెరికాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. టెక్సాస్లో సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మృతులు తెలంగాణలోని నారాయణపేట్ జిల్లాకు చెందిన వారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఓ మహిళ ఉన్నారు. సమాచారం అందిన వెంటనే టెక్సాస్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.
మృతులను జీ నరసింహా రెడ్డి, ఆయన భార్య లక్ష్మి, కుమారుడు భరత్ కుమార్ రెడ్డిగా గుర్తించారు. నరసింహా రెడ్డి స్వస్థలం జిల్లాలోని మరికల్ మండలం పెద్దచింతకుంట. ఈ ప్రమాదంలో ఆయన కోడలు మౌనిక, ఫ్యామిలీ ఫ్రెండ్ సాయి ప్రణీత్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. మౌనిక పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలకు సమాచారం అందింది. నరసింహా రెడ్డి ఆర్టీసీ ఉద్యోగి. హైదరాబాద్-1 డిపోలో కండక్టర్గా పనిచేస్తున్నారు.
Recommended Video
కుమారుడు భరత్.. కోడలు మౌనిక సాఫ్ట్వేర్ ఇంజినీర్లు. ఉద్యోగ రీత్యా టెక్సాస్లో స్థిరపడ్డారు. కొన్ని నెలల కిందట నరసింహా రెడ్డి దంపతులు అమెరికాకు వెళ్లారు. శనివారం తమ బంధువుల ఇంట్లో ఏర్పాటైన ఓ శుభకార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం స్వస్థలానికి తిరుగుముఖం పట్టిన సమయంలో వారు ప్రయాణిస్తోన్న కారు ప్రమాదానికి గురైంది. నారాయణ రెడ్డి, లక్ష్మి, భరత్ కుమార్ రెడ్డి సంఘటనా స్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. మౌనిక, సాయి ప్రణీత్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు.