భార్యలను వదిలేసి పోతే ఎన్నారై భర్తలకు చుక్కలే
న్యూఢిల్లీ: భార్యలను వదిలేసి చెక్కేసే ఎన్నారై భర్తలకు చుక్కలు చూపించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధపడింది. భార్యలను వదిలేసి విదేశాలకు వెళ్లిపోయి కోర్టులకు హాజరు కాకుండా తప్పింంచుకుంటున్న భర్తలపై చర్యలు తీసుకోవడానికి కార్యాచరణను సిద్ధం చేస్తోంది.
భార్యలను స్వదేశంలో వదిలేసి, నోటీసులకు ప్రతిస్పందించని ఎన్నారై భర్తలను ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి తగిన ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకా గాంధీ ఇందుకు సంబంధించిన వివరాలను అందించారు.
చట్టంలో మార్పులు తేవడానికి...
భార్యలను వదిలేసి వెళ్లిపోయే ఎన్నారై భర్తల ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి వీలు కల్పిస్తూ క్రిమినల్ చట్టంలో కీలకమైన మార్పులు తేవాలని ఆలోచిస్తున్నట్ల మేనకా గాంధీ చెప్పారు.
మూడు సమన్లకు స్పందించకపోతే...
సమన్లు తీసుకోకుండా, మూడు నోటీసుల తర్వాత కూడా స్పందించని వ్యక్తులను పరారీలో ఉన్నట్లుగా పరిగణిస్తారని మహిళాశిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అంటోంది. అటువంటి వ్యక్తులకు, ఆ వ్యక్తుల కుటుంబాలకు చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు అధికారాలు ఇవ్వనున్నట్లు శాఖ కార్యదర్శి రాకేష్ శ్రీవాత్సవ అన్నట్లు వార్తలు వచ్చాయి.
సమన్లను నెట్లో పెడితే చాలు...
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో సమన్లను పోస్టు చేస్తే వాటిని అందించినట్లుగా భావించే విధంగా కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రోసీజర్ (సిఆర్పీసి)లో సవరణలు చేయనున్నట్లు శ్రీవాత్సవ తెలిపారు. అటువంటి మూడు సమన్లు వెబ్సైట్లో పెట్టిన తర్వాత కూడా స్పందించకపోతే సమన్లను తీసుకోవడాన్ని దాటవేస్తాడని భావించాల్సి వస్తుందని అన్నారు. తద్వారా పరారీలో ఉన్న వ్యక్తిగా పరిగణించాల్సి వస్తుందని అన్నారు.
ఇప్పటికే రాశారు...
సిఆర్పీసిలో తేవాల్సిన సవరణలపై ప్రతిపాదనలను తమ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ హోం మంత్రిత్వ శాఖకు పంపినట్ల శ్రీవాత్సవ మీడియా సమావేశంలో చెప్పారు. 2015 జనవరి నుంచి 2017 నవంబర్ వరకు తమ భర్తలపై 3,328 మంది ఎన్నారై భార్యలు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు.