అలరించిన అలేఖ్య సంగీత ప్రదర్శన
ఇండియానాపోలీస్: గతవారం ఇండియానాపొలిస్లో అంకరాజు అలేఖ్య కర్ణాటక శాస్త్రీయసంగీత రంగప్రవేశం దిగ్విజయంగా జరిగింది. మృదంగ విద్వాన్ త్రివేండ్రం బాలాజీ, వాయులీన విదూషి కుమారి రంజనీ రామకృష్ణలు వాయిద్య సహకారమందించారు.
ఎనిమిదవ తరగతి చదువుతున్న అలేఖ్య, నాలుగు సంవత్సరాల చిరుప్రాయంలొనే తన తల్లి వద్ద శాస్త్రీయసంగీతంలో తొలిపాఠాలు నేర్చుకుంది. వసంత శ్రీనివాసన్, శ్రీమతి లక్ష్మివారణాసిల వద్ద శిష్యరికంచేసి, గతనాలుగుసంవత్సరాలుగా కళారత్న డి శేషాచారి(హైదరాబాద్ బ్రదర్స్) వద్ద స్కైప్ (అంతర్జాల దృశ్యశ్రవణ) మాధ్యమం ద్వారా తర్ఫీదుపొందుతోంది.
గాత్రంలోనేకాక, కర్నాటక, పశ్చిమ శాస్త్రీయ సాంప్రదాయ పద్ధతుల్లో వాయులీనవాద్యమందు కూడా అలేఖ్య సుశిక్షితురాలు. కచేరినందు, శృతిశుద్ధమైన గాత్రం, సాధికారికమైన ఉఛ్చారణ, భావగాంభీర్యత తనప్రత్యేకతలని వివిధ రాగమాలికాలాపనలద్వారా ప్రకటితం చేయడంలో సఫలీకృతురాలయ్యింది లలిత, కృష్ణ అంకరాజుల జ్యేష్ట పుత్రికయైన అలేఖ్య. రాగతాళరీతులందు తన ప్రావీణ్యత, మనోధర్మానుసార రాగవిస్తారణాకౌశలము, జతిగతిగమననియంత్రణాపటిమలను సభాసదులు సదృశముగా తిలకించి, సకర్ణముగా ఆలకించారు.
సంగీతసాధనతోపాటూ, విధ్యాభ్యాసం, సేవాసంబంధిత వ్యాసంగములందేగాక, జాతీయస్థాయి స్పెల్లింగ్ బీ పోటీలందుకూడా జయకేతనమెగురవేస్తున్న చిన్నారిని ఆహుతులందరూ ప్రశంసించారు. తన సాధనవెనుక వెన్నుదన్నుగానిల్చిన తల్లిదండ్రులను, గురువులను, శ్రేయొభిలాషులను వినమ్రశీలియైన అలేఖ్య సభాముఖముగా ప్రస్తుతించడం, రసజ్ఞుల హృదయాలను ఆకట్టుకుంది.